కరోనా: ‘ప్లాస్మా థెరపీ’తో చెక్‌!

4 Apr, 2020 12:00 IST|Sakshi
టిఫానీ పీంక్నే(ఫొటో: ఏపీ)

కరోనా కట్టడికై అమెరికా వైద్యుల ప్రయోగాలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్‌ ధాటికి విలవిల్లాడుతోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ దాదాపు 1,500 మంది ఈ మహమ్మారికి బలయ్యారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణాంతక వైరస్‌కు విరుగుడు కనిపెట్టే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే సీటెల్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం కాగా... ది ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్లాస్మా థెరపీతో వైరస్‌ ప్రభావాన్ని తగ్గించే పనిలో పడింది. 1918లో ప్రబలిన ఫ్లూను అరికట్టేందుకు ఉపయోగించిన ‘కన్వాల్సెంట్‌ సీరం(రోగం బారిన పడి స్వస్థత పొందిన వారి సీరం సేకరించడం)’ పద్ధతిని తెరమీదకు తీసుకువచ్చింది. ఈ క్రమంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తాన్ని సేకరించి ప్రయోగాలు చేపడుతోంది. 

ఈ నేపథ్యంలో కరోనాను జయించిన న్యూయార్క్‌కు చెందిన టిఫానీ పింక్నే తన రక్తాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చారు. తద్వారా ప్లాస్మా థెరపీ ప్రయోగాలకు సిద్ధమైన తొలి వ్యక్తిగా నిలిచారు. కరోనా కారణంగా తాను మరణం అంచుల దాకా వెళ్లానని.. అలాంటి చేదు అనుభవాలు ఇంకెవరికీ ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘నా రక్తంలో ఇందుకు సమాధానం దొరుకుతుందంటే ఎంతో సంతోషంగా’’అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.  (కరోనా: మరో షాకింగ్‌ న్యూస్‌!)

కాగా వైరస్‌ బారిన పడి కోలుకున్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాను సేకరించి.. అందులోని వ్యాధి నిరోధక పరమాణువులను గుర్తిస్తారు. వాటి పనితీరును పరీక్షించి వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే అవకాశాలను అంచనా వేస్తారు. అయితే ఈ పద్ధతి పూర్తిస్థాయిలో ఫలితాలు ఇస్తుందన్న విషయంపై స్పష్టతలేదు. అయినప్పటికీ కరోనా ఇప్పటివరకు వ్యాక్సిన్‌ కనుగొననందు వల్ల దాని తీవ్రతను తగ్గించేందుకు ఈ పద్దతి ఉపయోగపడనునందని మాయో క్లినిక్‌ పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికా రెడ్‌ క్రాస్‌ సంస్థ ఇందుకు సంబంధించిన ప్రయోగాల కోసం ప్లాస్మా సేకరించడం, పంపిణీ చేసే బాధ్యత తీసుకుందని వెల్లడించారు. (కరోనా వైరస్‌: ఎందుకంత ప్రమాదకారి?))

ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ మౌంట్‌ సినాయి ఆస్పత్రి అధ్యక్షుడు డేవిడ్‌ రీచ్‌ మాట్లాడుతూ... పింక్నే కరోనా నుంచి కోలుకున్నారని.. ఇతరులకు సాయం చేసేందుకు తన రక్తాన్ని దానం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. అయితే ఈ పద్ధతి పూర్తిస్థాయిలో ఫలితాలనిస్తుందా లేదా అన్న విషయం కచ్చితంగా చెప్పలేమన్నారు. ఇక గతంలో తట్టు వంటి మహమ్మారులకు విరుగుడు కనిపెట్టేందుకు కాన్వాల్సెంట్‌ సీరం పద్ధతిని ఉపయోగించారు. సాధారణంగా మనిషికి ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ సోకినపుడు శరీరం యాండీబాడీస్‌ను సిద్ధం చేస్తుంది. ప్రత్యేకమైన ప్రోటీన్లతో కూడిన ఈ వ్యాధినిరోధకాలు రక్తంలో కొన్నేళ్లపాటు ప్రవహిస్తూనే ఉంటాయి. కాబట్టి ఇన్‌ఫెక్షన్ల నుంచి కోలుకున్న బాధితుల శరీరాల నుంచి సేకరించిన ప్లాస్మా, సీరంను ఉపయోగించి కొత్త వ్యాధులను ఎదుర్కొనే అవకాశాలను అంచనా వేసేందుకు వీలు కలుగుతుంది.
 

మరిన్ని వార్తలు