కరోనా: ఆరు వారాల శిశువు మృతి

2 Apr, 2020 08:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌ : అమెరికాలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం చిగురుటాకులా వణుకుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా లక్షణాలతో కనెక్టికట్‌ రాష్ట్రంలో ఆరు వారాల శిశువు మరణించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ బుధవారం వెల్లడించారు. శిశువు మరణంతో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో ఈ చిన్నారే అతి చిన్న వయస్కురాలుగా నమోదైనట్లు ఆయన తెలిపారు. శిశువు మరణంపై గవర్నర్‌నెడ్ లామోంట్ విచారం వ‍్యక్తం చేశారు. ట్విటర్‌ ద్వారా స్పందించిన ఆయన.. గతవారం స్పందన కోల్పోయిన నవజాత శిశువును ఆసుపత్రికి తీసుకువచ్చారని, మంగళవారం శిశువుకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. (యూరప్‌లో 30 వేల మంది మృతి)

మరోవైపు న్యూయార్క్‌, కనెక్టికట్‌, న్యూ జెర్సీ రాష్ట్రాలలోని ప్రజలు అత్యవసరం అనిపిస్తే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఈ మూడు రాష్ట్రాలలోనే లక్ష కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తోందని, ఇంట్లోనే ఉండటం వల్ల వైరస్‌ను వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. దీని వల్ల తమ జీవితాలతోపాటు ఇతరుల జీవితాలు సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు. (ఏపీలో 111 కరోనా పాజిటివ్‌ కేసులు  )

ఇక ఇప్పటి వరకు అమెరికాలో 4476 మంది కరోనాకు బలవ్వగా.. 2,13,372 కేసులు నమోదయ్యాయి. కేవలం న్యూయార్క్‌లోనే మరణాలు అధికంగా నమోదవ్వడం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నగరంలో దాదాపు 2 వేల మంది మృత్యువాతపడ్డారు.  (ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం)

కోవిడ్‌-19 : మరణాల రేటు ఎంతంటే..

మరిన్ని వార్తలు