వేలాది మంది చస్తారంటూ హెచ్చరిక

6 Apr, 2020 14:55 IST|Sakshi

న్యూఢిల్లీ : స్వీడన్‌లో కరోనా వైరస్‌ రోజు రోజుకు విస్తరిస్తున్నప్పటికీ అక్కడి ప్రజలు సామాజిక దూరాన్ని పాటించకుండా రెస్టారెంట్లకు, బీచ్‌లకు వెళుతుండడం పట్ల ఆదేశ ప్రధాని స్టీఫన్‌ లావ్‌వెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలామంది చావు కోసం ఎదురు చూడడంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇరుగు, పొరుగు దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తుండగా, స్వీడన్‌ రోడ్లతోపాటు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్ల ప్రజలతో కళకళలాడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు డాక్టర్లు, అకడమిక్స్‌ హెచ్చరించడం, లాక్‌డౌన్‌ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా నోబెల్‌ ఫౌండేషన్‌ లేఖ రాసిన నేపథ్యంలో దేశ ప్రధాని సోమవారం నాడు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పొరుగు దేశాలైన స్పెయిన్, ఇటలీ, జర్మనీ గత మార్చి 22వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పటి నుంచి ఆ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

స్వీడన్‌లో లాక్‌డౌన్‌ను ప్రకటించకుండా తొలుత ఎక్కడా,  ఎలాంటి కార్యక్రమాల్లో కూడా 500 మందికి మించి పాల్గొన రాదంటూ ఆంక్షలు విధించిన ప్రభుత్వం తర్వాత 50 మందికి మించి పాల్గొనరాదంటూ ఆంక్షలను సవరించింది. కరోనాను అరికట్టడం తమ బాధ్యతగా భావించి స్వచ్ఛందంగా సామాజిక దూరాన్ని పాటించాలంటూ పిలుపునిచ్చింది. దీన్ని ఎవరు లెక్క చేయడం లేదు. రెస్టారెంట్లు, బార్లు, ప్రాథమిక పాఠశాలలు తెరచే ఉంటున్నాయి. స్వీడన్‌లో ఇప్పటి వరకు 6,830 కరోనా కేసులు నమోదుకాగా, 401 మంది మరణించారు.

మరిన్ని వార్తలు