అమెరికాపై కరోనా వైరస్‌ ప్రతాపం

27 Mar, 2020 08:58 IST|Sakshi

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏ ఒక్క వర్గాన్ని, రంగాన్నీ వదలకుండా యూఎస్‌పై విలయతాండవం చేస్తోంది. శుక్రవారం ఉదయం నాటికి అందిన సమాచారం ప్రకారం అ దేశంలో కరోనా కేసుల సంఖ్య 85,594కు చేరి చైనాను అధిగమించింది. అలాగే 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో గురువారం ఒక్కరోజే 17వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక వాణిజ్య రాజధానిగా పేరొందిన న్యూయార్క్‌లో వైరస్‌ తీవ్రత రోజురోజుకూ విజృభింస్తోంది. మరోవైపు వైరస్‌ను కట్టడిచేయడంలో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుందని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. (ఆర్‌బీఐ మరో రిలీఫ్ ప్యాకేజీ?)

కరోనా వైరస్‌ పురుడుపోసుకున్న చైనాను అమెరికా అధిగమించడంతో ఆ దేశ వాసులు తీవ్ర భయాందోళనలకు గురువుతున్నారు. చైనాలో ఇప్పటి వరకు 81,340 కేసుల నమోదు అవ్వగా.. ఆ సంఖ్యను అమెరికా అధిగమించింది. మరోవైపు ఇటలీలోనూ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇటలీలో 80,589, స్పెయిల్‌లో 57,786, జర్మనీ 43,938 కేసులు నమోదు అయ్యాయి. ఇక అత్యధిక మరణాలతో ఇటలీ చిగురుటాకులా వణుకుతోంది. ఇటలీలో 8,215, స్పెయిన్‌ 4,365, చైనా 3,292, ఇరాన్‌ 2,234 మరణాలను నమోదు అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 24 వేలుకు పైగా దాటిపోయింది. ఇక భారత్‌లో 727 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 16కు చేరింది.

మరిన్ని వార్తలు