లండన్: ఒకవైపు యూరప్లోని పలుదేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూంటే.. బ్రిటన్, రష్యాల్లో మాత్రం కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో శుక్రవారం నుంచి కొన్ని కార్యకలాపాలు మొదలు కానున్నాయి. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం అమెరికాలో ఒక్క రోజులో నమోదైన కొత్త కేసులు సుమారు 20 వేలు ఉండగా వెయ్యి మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్లో ఇప్పటివరకూ మొత్తం 28,734 మంది కోవిడ్తో మరణించారని అధికారులు తెలిపారు. అయితే, కొన్ని కోవిడ్ అనుమానిత మరణాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం 30 వేల కంటే ఎక్కువ మంది మరణించినట్లు అధికార గణాంకాలు తెలిపాయి. దీంతో బ్రిటన్ మరణాల విషయంలో ఇటలీ (29,079)ని దాటింది.
నిబంధనలు సడలిస్తే ముప్పే..
భౌతికదూరం వంటి నిబంధనలను సడలిస్తే కరోనా కారణంగా వచ్చే ఆగస్టులోగా అమెరికాలో 1.34 లక్షల కంటే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదముందని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ మోడలింగ్ ఒకటి తెలిపింది. నిబంధనల సడలింపుతో మరణాలు ఎక్కువవుతాయని ఈ మోడల్ రూపకర్త అయిన డాక్టర్ క్రిస్టఫర్ ముర్రే స్పష్టం చేశారు.
భారతీయ సంతతి శాస్త్రవేత్త ఘనత
కరోనా వైరస్ చికిత్సకు ఉపయోగపడే నాలుగు రసాయనాలను తాము గుర్తించామని.. ఇందులో ఎబోలా చికిత్సకు ఉపయోగించిన రెమిడెస్విర్ కూడా ఉందని భారత సంతతి శాస్త్రవేత్త, మిస్సోరీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ కమలేంద్ర సింగ్ ప్రకటించారు. రెమిడెస్విర్ మాత్రమే కాకుండా.. 5–ఫ్లూరోరౌకాసిల్, రైబావిరిన్, ఫావిపిరవిర్ అనే నాలుగు రసాయనాలు కరోనా చికిత్సకు వాడవచ్చునని స్పష్టమైందని, ఇవన్నీ వైరస్లోని ఆర్ఎన్ఏ సంతతి ఎక్కువ కాకుండా అడ్డుకోవడం లేదా నిలిపివేయడం ద్వారా పనిచేస్తాయని ఆయన వివరించారు.