కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం

2 Apr, 2020 11:53 IST|Sakshi
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (ఫైల్ ఫోటో)

చిన్న వ్యాపారాలకు,  ఆరోగ్య కార్యకర్తలకు బాసటగా గూగుల్

800 మిలియన్ డాలర్లు ప్రకటించిన గూగుల్   

కాలిఫోర్నియా: ప్రపంచ వ్యాప్తంగా మహారక్కసిలా విరుచుకుపడుతున్న కరోనాపై యుద్ధానికి  తమ వంతుగా కార్పొరేట్ దిగ్గజాలు కదిలి వస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్-19పై పోరుకు సెర్జింజన్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. చిన్న,మధ్య తరహా వ్యాపారులను (ఎస్‌ఎంబీస్) ఆదుకునేందుకు, 800 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,990 కోట్లు) సహాయాన్ని ప్రకటించింది. చిన్న వ్యాపారాలతోపాటు మహమ్మారి కరోనాపై చేస్తున్న ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.  అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలా నిరోధించాలనే దానిపై సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు(డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా ప్రభుత్వ సంస్థలకు 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,872 కోట్లు) యాడ్ గ్రాంట్స్‌ను గూగుల్ అందిస్తుందని ఆయన తెలిపారు. 

వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ), ఇతర వైద్య పరికరాల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సహాయం అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఎంత మొత్తం అనేది వెల్లడించలేదు. అవసరమైన పరికరాల తయారీ దారులకు, ఫెడరల్ ప్రభుత్వం సహాయం చేయడానికి గూగుల్ తన ఉద్యోగులను  గుర్తిస్తామని గూగుల్   పేర్కొంది.  రాబోయే కొన్ని వారాల్లో 2 నుంచి మూడు మిలియన్ల ఫేస్‌మాస్క్‌లను ఉత్పత్తి చేసేందుకు మాజిడ్ గ్లోవ్స్ అండ్ సేఫ్టీతో కలిసి గూగుల్ పనిచేస్తోంది. అలాగే కమ్యూనిటీ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎన్జీవోలకు ప్రకటన గ్రాంట్లలో 20 మిలియన్ డాలర్లు ఇవ్వనుండగా, గూగుల్ యాడ్స్ క్రెడిట్స్‌లో 340 మిలియన్ డాలర్లు  మేర అర్హత ఉన్న ఖాతాలకు గూగుల్ స్వయంచాలకంగా క్రెడిట్‌ను అందుబాటులో ఉంచనుంది. చిరువ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్జీవోలు, ఫైనాన్షియల్ సంస్థలకు 200 మిలియన్ డాలర్ల నిధిని ప్రకటించింది. ఈ పెట్టుబడుల నిధిని సమకూర్చడం ద్వారా నగదు లభ్యత అందించనున్నామని, తద్వారా వ్యాపారాలకు,  ఇతర ప్రభుత్వేతర సంస్థల ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు లభిస్తుందన్నారు. కరోనా వైరస్ మహమ్మారిపై అధ్యయనం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులకు గూగుల్ క్లౌడ్‌లో 20 మిలియన్ డాలర్లను అందించనుంది. తద్వారా టీకాలు రూపకల్పన, చికిత్సలను అధ్యయనం చేయడానికి లేదా డేటాను ట్రాక్ చేయడానికి ఉపయోగించుకోవచ్చని  పిచాయ్ వివరించారు.

>
మరిన్ని వార్తలు