కోవిడ్‌-19: ఉచితంగా 2 వేల ఐఫోన్లు పంచిన జపాన్‌!

17 Feb, 2020 12:16 IST|Sakshi

టోక్యో: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో జపాన్‌లోని యెకోహోమా తీరంలో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ అనే నౌకలోని ప్రయాణికులందరికీ ఆ దేశ ప్రభుత్వం ఐఫోన్లను ఉచితంగా పంపిణీ చేసింది. కోవిడ్‌ లక్షణాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు వైద్యాధికారులతో టచ్‌లో ఉండేందుకు అత్యాధునిక ఫోన్లను వారికి అందించినట్లు పేర్కొంది. డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 3,700 మంది ఉన్నారు. వీరిలో దాదాపు కోవిడ్‌ సోకిన వారి సంఖ్య 350కి చేరినట్లు వార్తలు వెలువడటంతో.. నౌకలో ఉన్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. (కోవిడ్‌ మృతులు 1,665)

ఈ క్రమంలో జపాన్‌ వైద్య శాఖ, దేశ అంతర్గత వ్యవహారాల శాఖతో సమన్వయమై.. 2000 మందికి ఐఫోన్లు పంపిణీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వాటిల్లో లైన్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి.. ప్రయాణికులకు పంపిణీ చేశారని పేర్కొంది. తద్వారా మందుల వాడకం, వైద్యుల అప్పాయింట్‌మెంట్‌ తీసుకోవడం, మానసికంగా ఒత్తిడికి గురవుతున్న వాళ్లు సైకాలజిస్టులతో చర్చించడం సహా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకునే సౌకర్యం ప్రయాణికులకు కల్పించినట్లు తెలిపింది. జపాన్‌ కాకుండా నౌకలో ఉన్న ఇతర దేశాల ప్రయాణికుల ఫోన్లలన్నింటిలో లైన్‌ యాప్‌ అందుబాటులో లేనందున ఐఫోన్లు అందించినట్లు పేర్కొంది. కాగా ఈ నౌకలో 138 మంది భారతీయులు సహా 40 మందికి పైగా అమెరికా ప్రయాణికులు ఉన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు