ప్రధాని సహా 15 లక్షల మంది ఇన్ఫర్మేషన్‌ చోరీ

20 Jul, 2018 18:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం. ఇన్‌సెట్లో ప్రధాని లీ హీన్‌ లూంగ్‌

సింగపూర్‌: హ్యాకర్ల దాడితో సింగపూర్‌ వణికిపోయింది. ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన డాటాబేస్‌ నుంచి ఏకంగా 15 లక్షల మంది సింగపూర్‌ వాసుల ఆరోగ్య వివరాలను సైబర్‌ నేరగాళ్లు తస్కరించారు.  ప్రధాని లీ హీన్‌ లూంగ్‌ ఆరోగ్య రహస్యాలను కాజేయడానికే ఈ హ్యాకింగ్‌ జరిగినట్లు భావిస్తున్నామని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇది ఆకతాయి చర్య కాదనీ, చాలా తెలివిగా, పథకం ప్రకారం జరిగిన దాడి అని అధికారులు పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి ఆరోగ్యానికి సంబంధించిన కీలక వివరాలను దొంగిలించడానికి ఆరోగ్య శాఖ డాటాబేస్‌పై సైబర్‌ దాడి జరిగిందని హెల్త్‌ మినిస్టర్‌ గన్‌ కిమ్‌ యోంగ్‌ మీడియాకు తెలిపారు. కాగా, ఎంతో అభివృద్ధి చెందిన సింగపూర్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అలాంటిది ప్రభుత్వ డాటాబేస్‌పైనే సైబర్‌దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిటీ నడిబొడ్డున్న రక్షణ శాఖకు చెందిన అధునాతన ఆయుధాలు ఉన్నందున సైబర్‌ దాడులపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు గతంలో పలుమార్లు హెచ్చరించాయి. ఇదిలా ఉండగా.. 2017లో రక్షణ శాఖ డాటాబేస్‌లోకి చొరబడిన దుండగులు 850 మంది ఆర్మీ అధికారుల వివరాలను హ్యాక్‌ చేశారు.

మరిన్ని వార్తలు