రెహ్మాన్‌ మాలిక్‌ నాపై అత్యాచారం చేశారు.. వారు వేధించారు

6 Jun, 2020 10:55 IST|Sakshi

ఇస్లామాబాద్:‌ అమెరికా బ్లాగర్‌ సింథియా డి రిచీ పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) సీనియర్‌ లీడర్‌, మాజీ విదేశాంగ మంత్రి రెహ్మాన్‌ మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2011లో ఆయన పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రిగా ఉండగా తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని సింథియా పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనంలో మాజీ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ, మాజీ ఆరోగ్య మంత్రి మఖ్దూమ్‌ షాహబుద్దీన్‌ కూడా తనను శారీరకంగా వేధించారని ఆమె ఆరోపించారు.

కాగా ఈ ఘటన సమయంలో అసిఫ్‌ అలీ జర్దారీ పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా ఉన్నట్లు సింథియా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రోజున ఆమె తన ఫేస్‌బుక్‌ పేజీ లైవ్‌ ద్వారా మాట్లాడుతూ.. ఈ ముగ్గురి వ్యవహారాలకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వచ్చే వారంలో వాటన్నింటినీ విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. కాగా.. మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో, మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో వైవాహిక జీవితంపై సింథియా డి రిచీ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ సింథియాపై గత వారం ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) సైబర్‌ క్రైమ్‌ విభాగానికి పీపీపీ షెషావర్‌ జిల్లా అధ్యక్షుడు జుల్ఫికర్‌ ఆప్ఘానీ ఫిర్యాదు చేశారు. సింథియా గత వారం బెనజీర్‌ భుట్టో గురించి 'ఇన్‌డీసెంట్‌ కరస్పాండెంట్‌ సీక్రెట్‌ సెక్స్‌ లైఫ్‌ ఆప్‌ బెనజీర్‌ భుట్టో’ పుస్తకంలోని కొన్ని భాగాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. పుస్తకంలో బెనజీర్ భుట్టో, ఆమె కుమారుడు బిలావల్ భుట్టో, పార్టీ సీనియర్ నేత షెర్రీ రెహమాన్ గురించి వివరంగా రాశారు. చదవండి: డీ గ్యాంగ్‌ బాస్‌కు కరోనా?​​​​​​​

పీపీపీ నేతలు మద్యం తాగుతూ, మహిళలతో డ్యాన్స్ వేస్తూ.. మోసం చేస్తారని సింథియా పునరుద్ఘాటించారు. సింథియా ఆరోపణల ప్రకారం.. బెనజీర్ భుట్టో మహిళలపై అత్యాచారాలు చేసేవారు అంటూ దివంగత రాజకీయ నాయకుల లైంగిక జీవితం గురించి ఆమె కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఒక బొమ్మల దుకాణం యొక్క రశీదును కూడా పోస్ట్ చేస్తూ సెక్స్ బొమ్మల వ్యాపారానికి సహాయం చేయడానికి తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించారనే ఆరోపణలను ఖండించమని పీపీపీ సీనియర్ నాయకుడు షెర్రీ రెహ్మాన్‌కు సవాల్‌ చేయడం గమనార్హం. చదవండి: జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి

ఎవరీ సింథియా డి. రిచీ..?
సింథియా నేపథ్యంపై పూర్తిగా ఆధారాలు లేవు. అయితే ఆమె 2009లో మొదటిసారిగా పాకిస్తాన్‌కు పర్యాటకురాలిగా వచ్చారు. తర్వాతి కాలంలో పాకిస్తాన్‌ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ, విదేశాంగ మంత్రి రెహ్మాన్‌ మాలిక్‌లతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. పీపీపీ కమ్యూనికేషన్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఈమె ఉర్దూ, పంజాబీ భాషలు మాట్లాడతారు. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో నివసిస్తూ.. ఫ్రీలాన్స్‌ ఫిల్మ్‌ మేకర్‌, రచయిత, కాలమిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ మధ్య పీపీపీ అధికారానికి దూరం కావడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ శిబిరంలోకి వెళ్లిన సింథియా పీపీపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు