ఎవరెస్ట్‌పై బయటపడుతున్న మృతదేహాలు

22 Mar, 2019 21:04 IST|Sakshi

టిబెట్‌: ఎవరెస్ట్‌ పర్వతం గురించి తెలియని వారుండరు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఏటా ఎంతో మంది ఔత్సాహికులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ ప్రయత్నంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు కూడా. గెలుపునే ఈ ప్రపంచం గుర్తిస్తుందన్నట్లు... మంచు పొరల్లో చిక్కుకుపోయిన వారి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే తాజాగా హిమానీనదాలు వేగంగా కరిగిపోతుండటంతో, ఇన్నాళ్లూ మంచు కిందే ఉండి పోయిన మృతదేహాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పర్వతంపై చైనా వైపున్న (ఉత్తర) ప్రాంతంలో కనిపించిన మృతదేహాలను చైనా యంత్రాంగం తొలగిస్తోంది. 

ఎవరెస్ట్‌ అధిరోహణ సీజన్‌ మొదలవుతున్న తరుణంలో ఈ కార్యక్రమం చేపట్టింది. ‘భూగోళం వేడెక్కుతుండటం(గ్లోబల్‌ వార్మింగ్‌) వల్ల ఎవరెస్టుపై ఉన్న హిమనీనదాలు, మంచు ఫలకాలు వేగంగా కరగిపోతున్నాయి. ఇంతకాలం మంచు కింద ఉండిపోయిన మృతదేహాలు ఇప్పుడు బయటకు కనిపిస్తున్నాయ’ని నేపాల్‌ పర్వతారోహణ సంఘం(ఎన్‌ఎంఏ) మాజీ అధ్యక్షుడు ఆంగ్‌ షెరింగ్‌ షెర్పా చెబుతున్నారు. ఎవరెస్ట్‌పై సుమారు 200 మృతదేహాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.    
 

మరిన్ని వార్తలు