బ్యాంకుల దోపిడీకి విఫలయత్నం

9 Dec, 2018 04:11 IST|Sakshi
మృతదేహాలను తరలిస్తున్న ఫోరెన్సిక్‌ బృందం

దోపిడీదారులు, పోలీసుల ఎదురుకాల్పుల్లో 12 మంది మృతి

బ్రెజిల్‌లోని మిలగ్రెస్‌లో ఘటన

రియో డీ జనీరో: బ్రెజిల్‌లో బ్యాంకుల లూటీకి దొంగల ముఠా చేసిన యత్నం విఫలమయింది. ఈ సందర్భంగా ముఠా, పోలీసుల మధ్య∙కాల్పుల్లో ముఠా వద్ద బందీలుగా ఉన్నావారుసహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ఉన్నారు. బ్రెజిల్‌లోని మిలగ్రెస్‌ సిటీలో శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది.  సుమారు 30 మంది ఉన్న సాయుధ దొంగల ముఠా సభ్యులు రెండు బ్యాంకులున్న వీధికి అడ్డంగా ట్రక్కును ఆపారు.

విషయం తెల్సుకున్న పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరిపారు. దొంగలకు, పోలీసులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. అదే సమయంలో అటువైపుగా వచ్చిన కారును దుండగులు అడ్డగించారు. అందులోని వారిని బందీలుగా ఉంచుకున్నారు. ఇరవై నిమిషాల పాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో బందీలుగా ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురూ చనిపోయారు. దుండగుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మిగతా వారు పరారయ్యారు. బందీల మృతికి కారణం పోలీసులా లేక దుండగులా అన్నది విచారణలో తేలుతుందని సియారా రాష్ట్ర గవర్నర్‌ తెలిపారు.
 

మరిన్ని వార్తలు