సాధారణంగా విడాకులు తీసుకోవాలంటే ఎన్నో కారణాలు ఉంటాయి. కాకపోతే ఇటీవల మరీ చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు కోర్టులకెక్కుతున్నారు. ఈ మధ్య ఈజిప్టులో ఓ వింత విడాకుల కేసు కోర్టు ముందుకొచ్చింది. అది కూడా భర్త నుంచి విడాకులు కావాలంటూ నవవధువు పెట్టిన కేసు.. వారిద్దరికీ పెళ్లయి సరిగ్గా 40 రోజులే అవుతోంది. మరి కొత్తగా పెళ్లయిన ఆ అమ్మాయికి ఏమంత కష్టం వచ్చిందో అనుకుంటున్నారా.. అసలు కారణం తెలిస్తే షాకవాల్సిందే.. జనానిరీ అనే మహిళకు అహ్మద్ అనే టీచర్తో పెళ్లయింది.
ఓరోజు తనకు షవర్మ కొనివ్వాలని తన భర్తను అడిగింది. అయితే అతడు అందుకు నిరాకరించాడట. షవర్మ అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు రొట్టెల మధ్య చికెన్ కర్రీని మడిచి కాస్త వేడి చేసి ఇస్తారు అంతే. దీనికే విడాకులు తీసుకోవడమేంటని కోర్టులో జడ్జి కూడా ఆశ్చర్యపోయాడట. పెళ్లయిన మొదటి రోజే తనకు బయటికి వెళ్లడం.. షాపింగ్ చేయడం అంటే అస్సలు నచ్చదని అహ్మద్ చెప్పాడట. ఎందుకంటే డబ్బులు వృథా చేయడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడట.
అయితే జనానిరీ దీన్ని మొదట్లో అంతగా పట్టించుకోలేదట. అయితే రోజులు గడిచే కొద్దీ పరిస్థితి దారుణంగా మారుతోందట. ఎంత డబ్బు వస్తున్నా కూడా పిసినారితనం తలనొప్పిగా మారిందని జడ్జికి తన గోడు వెళ్లబోసుకుంది. ఆఖరికి ఆహార పదార్థాల విషయంలో కూడా పిసినారిగా ప్రవర్తించేవాడట. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే మారుతాడులే అని సర్దిచెప్పారట. అయినా ఫలితం లేకపోవడంతో విడాకులు కోరింది.