కరోనా: మమ్మల్ని మేం కాపాడుకోలేకపోతున్నాం

8 Apr, 2020 13:21 IST|Sakshi

‘‘కుప్పకూలిపోతున్న ఓ రోగికి సహాయం చేసేందుకు నేను పరిగెత్తాను. తనను స్టెబిలైజ్‌ చేసే క్రమంలో సదరు నా పేషెంట్‌ నా దుస్తుల మీద వాంతి చేసుకున్నారు. పీపీఈ(పర్సనల్‌ ప్రొటెక్టివ్‌గేర్‌ ఎక్విప్‌మెంట్‌) లేదు. ఆ తర్వాత ఆ పేషెంట్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇవీ వైద్యులు రోజూ ఎదుర్కొంటున్న రిస్కులు. రోగులను కాపాడతామని మేం ప్రమాణం చేశాం. కానీ మమ్మల్ని మేం కాపాడుకోలేకపోతున్నాం’’ అని రూపా ఫారూఖీ అనే వైద్యురాలు ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరులో వైద్యులకు ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి వివరించారు. రూపా వైద్యురాలు మాత్రమే కాదు.. ఆమె ఓ రచయిత్రి కూడా. 

ప్రసుతం ఆమె ఇంగ్లండ్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ మదర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా రోజూ ఎంతో మంది కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత సంరక్షణ పరికరాలు లేకపోవడంతో వారు ఎదుర్కొంటున్న అనుభవాల గురించి ఈ విధంగా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. రూపా ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు.. ప్రాణాలను పణంగా పెట్టి పేషెంట్లను కాపాడుతున్న డాక్టర్లకు సలాం అంటూనే.. వారి రక్షణకై సరైన చర్యలు తీసుకోని ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. అత్యధిక మంది వైద్య సిబ్బంది మహమ్మారి బారిన పడితే సేవలు అందించే వారు లేక ప్రపంచం సర్వనాశనం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక కరోనా సోకి ఇప్పటికే పలువురు వైద్యులు మరణించిన విషయం తెలిసిందే.(మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య, కుమార్తె)

కాగా భారత్‌లో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కరోనా లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, మీడియాకు కృతజ్ఞతగా చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందరికి ధన్యవాదాలు తెలపడంతో పాటుగా.. పీపీఈలు కూడా అందించాలంటూ నెటిజన్లు డిమాండ్‌ చేశారు. అంతేకాదు కొంతమంది డాక్టర్లు కూడా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ... పీపీఈలు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.(డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేస్తాం: ట్రంప్‌)

14 లక్షలు దాటిన కరోనా కేసులు

మరిన్ని వార్తలు