చనిపోయిన యజమానికి 11ఏళ్లు కాపలా!

22 Feb, 2018 19:15 IST|Sakshi

విశ్వాసాన్ని చాటుకున్న అల్సాటియన్ జాతి శునకం

దాని ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థన

బ్యూనస్ ఎయిర్స్: విశ్వాసానికి మారు పేరు శునకాలు. అర్జెంటీనాలో ఓ శునకం తన యజమానిపై ఉన్న విశ్వాసాన్ని ఏళ్ల తరబడి నిరూపించుకుంది. తాజాగా ఆ శునకం చనిపోయింది. దీంతో దాని యజమాని కుటుంబంలో విషాదం నిండుకుంది. అదేంటీ కుక్క చనిపోతే ఎందుకంత బాధ అంటారా. ఆ వివరాల్లోకెళ్తే.. అర్జెంటీనా విల్లా కార్లోస్ పాజ్, కార్డోబాకు చెందిన మిగ్యేల్ గజ్‌మ్యాన్ అల్సాటియన్ జాతికి చెందిన కాపిటన్ అనే చిన్న కుక్కపిల్లను 2005లో  కొన్నాడు. అప్పుడు కాపిటన్ వయసు దాదాపు రెండేళ్లు.

గజ్‌మ్యాన్ తన కుమారుడు డామియన్‌(15)కు అదే సమయంలో పెట్ డాగ్‌ కాపిటన్‌ను కానుకగా ఇచ్చాడు. యజమాని గజ్‌మ్యాన్ ఆ కుక్క పిల్లను ఎంతో ముద్దుచేసేవాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా కాపిటన్‌ గజ్‌మ్యాన్‌నే అనుసరించేది. కానీ మరుసటి ఏడాది (2006)లో గజ్‌మ్యాన్ మృతిచెందాడు. కొన్నిరోజుల పాటు విషాధంలో ఉన్న కుటుంబసభ్యులు ఆ తర్వాత మామూలు మనుషులయ్యారు. కానీ విశ్వాసానికి మారుపేరైన కాపిటన్ తన యజమాని మరణాన్ని తట్టుకోలేక పోయింది. ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కాపిటన్ వేరే ఇంటిని చూసుకుందో, లేక చనిపోయిందోనని గజ్‌మ్యాన్ ఫ్యామిలీ భావించింది. 2007లో గజ్‌మ్యాన్‌కు నివాళి అర్పించేందుకు సమాధివద్దకు రాగా ఆశ్చర్యం.. కాపిటన్ బాధతో సమాధిని చూస్తు కూర్చుంది.

కాపిటన్‌ను యజమాని కుమారుడు డామియన్ మళ్లీ ఇంటికి తీసుకెళ్లినా.. అది బయటకు వెళ్లిపోయేది. పగలు ఇంట్లో ఉన్నా.. రాత్రికి మాత్రం ఎక్కడికో వెళ్లేది. ప్రతిరోజు రాత్రి యజమాని గజ్‌మ్యాన్ సమాధి వద్దకు వెళ్తుందన్న విషయం తమకు ఆరేళ్ల తర్వా తెలిసిందని డామియన్ చెప్పాడు. అప్పటినుంచీ కాపిటన్ (శునకం) ఆర్జెంటీనాలో ఫేమస్. ఇలా దాదాపు 11ఏళ్లకు పైగా ప్రతిరోజూ తన తండ్రి సమాధివద్దే నిద్రించే కాపిటన్ నేడు మన మధ్య లేదంటూ వాపోయాడు డామియన్. ఇంటి నుంచి తన తండ్రి సమాధి చాలాదూరం ఉన్నా.. ప్రతిరోజు రాత్రి తమ పెట్ డాగ్ అక్కడికి వెళ్లడం మరిచిపోలేని అంశమన్నాడు. తన తండ్రి సమాధి వద్దకు ఒక్కసారి కూడా తాము కాపిటన్‌ను తీసుకెళ్లకున్నా, కానీ అది తన విశ్వాసాన్ని ఇన్నేళ్లు చూపిందని.. చనిపోయిన తర్వాత కూడా అది(శునకం) ఆయన వద్దకే కాపలాగా వెళ్లి ఉంటుందని ఏడ్చేశాడు డామియన్.

>
మరిన్ని వార్తలు