కీలక భేటీకి ముందే ఘాటు హెచ్చరిక!

10 Jun, 2018 16:27 IST|Sakshi
డొనాల్డ్‌ ట్రంప్, కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (ఫైల్‌ ఫొటో)

లామాల్బె(కెనడా): ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్న అంశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల కీలక సమావేశం. అయితే తమకు ఇష్టం లేకపోతే ఎలాంటి చర్యలకైనా సిద్ధపడటం, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంలో ఇద్దరూ ఇద్దరే అన్న విషయం తెలిసిందే. అయితే తొలుత భేటీ రద్దు చేసుకున్న ట్రంప్‌.. ఆపై నియంత కిమ్‌ విజ్ఞప్తి మేరకు తన నిర్ణయంపై వెనక్కి తగ్గారు. కానీ, కిమ్‌ వైఖరి ఈ కీలకభేటీలో ఆసక్తి చూపించనట్లు కనిపిస్తే మాత్రం తాను మధ్యలోనే వెళ్లిపోతానంటూ హెచ్చరికలు పంపారు అగ్ర రాజ్యాధినేత ట్రంప్‌. భారత కాలమానం ప్రకారం ఈ నెల 12న (మంగళవారం) ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌లో కిమ్‌, ట్రంప్‌ భేటీ కానున్నారు.

ప్రపంచ శాంతి కోసం తమ వంతు కృషి చేయడానికి ఇరు దేశాల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా చూడాలన్నది సింగపూర్‌ సమావేశం ప్రధాన ఉద్దేశం. తనను తాను చాలా తెలివైన వాడిగా పేర్కొన్న ట్రంప్‌.. ఆ భేటీలో కొంత సమయానికే కిమ్‌ మనసులో ఏముందో తాను పసిగట్టగలనని భావిస్తున్నారు. కిమ్‌ వైఖరి తనకు నచ్చకపోయినా, లేక నామమాత్రంగా భేటీకి వచ్చినట్లనిపిస్తే అర్ధాంతరంగా తాను వెళ్లిపోతానని ట్రంప్‌ స్పష్టం చేశారు. కెనడాలో జీ7 సదస్సు నుంచి కిమ్‌తో భేటీ కోసం సింగపూర్‌ బయలుదేరనున్న నేపథ్యంలో ట్రంప్‌ తన మనసులో మాట వెల్లడించారు.

ఉత్తర కొరియా అణ్వస్త్రరహిత దేశంగా మారిపోవాలని, ఉభయ కొరియాలను చైనా నుంచి వేరు చేసే ఎల్లో సముద్రంపై కొంతవరకైనాఆధిపత్యం సాధించాలని ట్రంప్‌ భావిస్తున్నారు. కాగా, ప్రపంచ దేశాల్లో తన పరిపాలనకు ఒక గుర్తింపు దక్కాలని, ఉత్తర కొరియాకు అణు దేశం అన్న హోదా దక్కాలని నియంత కిమ్‌ ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు