సమరం కాదు.. శాంతి కావాలి: ట్రంప్‌

1 Jan, 2020 14:02 IST|Sakshi
డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌: తాను శాంతి కాముకుడినని, తనకు యుద్ధం అంటే ఇష్టం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోబోమని, యుద్ధం చేసే ఆలోచన లేదని తెలిపారు. ఇరాన్‌ మద్దతున్న హిజ్బుల్‌ బ్రిగేడ్‌ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్‌లోని పరిస్థితిని చాలా బాగా చక్కదిద్దామని చెప్పారు.

ఇరాన్‌తో యుద్ధం చేసే ఆలోచన ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘యుద్ధం చేయాలన్న ఆలోచన ఇరాన్‌కు మంచిదని నేను అనుకోవడం లేదు. నేను శాంతి కోరుకుంటున్నాను. యుద్ధం రావాలని అనుకోవడం లేద’ని ట్రంప్‌ సమాధానం ఇచ్చారు. బాగ్దాద్‌లో తమ రాయబార కార్యాలయంపై దాడికి ఇరాన్‌దే పూర్తి బాధ్యత అని, దీనికి ఇరాన్‌ భారీగా మూల్యం చెల్లించుకుంటుందని అంతకుముందు ట్రంప్‌ హెచ్చరించారు. ‘ఇది హెచ్చరిక కాదు, ఇది ముప్పు’ అంటూ ట్వీట్‌ చేశారు. తమ కార్యాలయంపై దాడిని భద్రత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని, సిబ్బంది సురకక్షితంగా ఉన్నారని తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించిన ఇరాక్‌ ప్రధాని, అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు.

కాగా, దాడి జరిగిన వెంటనే బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి అదనపు బలగాలను తరలించినట్టు పెంటగాన్‌ ప్రకటించింది. మంగళవారం ఇరాక్‌ ప్రధాని ఆదిల్‌ అబ్దుల్‌ ఆల్‌-మహదితో ఫోన్‌ మాట్లాడినట్టు వెల్లడించింది. (చదవండి: ఇరాక్‌లో యూఎస్‌ ఎంబసీపై దాడి)

మరిన్ని వార్తలు