వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత మైక్ పెన్స్తో అమెరికా సుప్రీంకోర్టు జడ్జి క్లారెన్ థామస్ ప్రమాణం చేయించగా, అనంతరం డొనాల్డ్ ట్రంప్తో అమెరికా అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. గత నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే స్లోగన్తో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్పై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ పలు విషయాలను ప్రసంగించారు. ఉగ్రవాదం, వలసలు, అమెరికా సవాళ్లు ఇలా చాలా అంశాలపై ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించిన పలు కీలక అంశాలు:
-
ఒబామా దంపతులు, మాజీ అధ్యక్షులు, అమెరికా ప్రజలకు ధన్యవాదాలు
-
అమెరికాను పునర్ నిర్మించే కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుదాం
-
ఎన్నో సవాళ్లను అధిగమించాం, కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకున్నాం
-
వాషింగ్టన్ డీసీ నుంచి అధికారాన్ని ప్రజలకే అందిస్తాను
-
ఇది మీరోజు.. ఈ విజయం మీది.. అమెరికా మీ దేశం
-
పక్క దేశాల చొరబాట్ల నుంచి మన సరిహద్దులను రక్షించుకుందాం
-
ఇక ముందు వేసే ప్రతి అడుగులోనూ మనదే గెలుపు
-
అమెరికా కోసం మనం రెండే విధానాలు పాటిద్దాం. అమెరికన్లకే ఉద్యోగాలిద్దాం.. అమెరికన్ వస్తువులనే కొందాం
-
మాటలు చెప్పే కాలం ముగిసింది. ఇక చేతలు ప్రారంభం
-
నల్లవాడైనా, తెల్లవాడైనా.. అందరి రక్తం ఎరుపే
-
నేతలు గొప్పవాళ్లు అయ్యారేమో కానీ.. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు
-
ఇక నుంచి ప్రజలే పాలకులు. మిమ్మల్ని ఎప్పుడూ తలదించుకోనివ్వను
-
అమెరికాను అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుదామన్నారు
-
ఈ భూమి మీద నుంచి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నిర్మూలిస్తాం
(చదవండి: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం)