వలసలకు అమెరికా బ్రేక్‌..

21 Apr, 2020 08:48 IST|Sakshi

వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటన

వాషింగ్టన్‌ : కరోనా మహమ్మారి విజృంభణతో అమెరికాలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా తయారవుతున్నాయి. అగ్ర రాజ్యం ఆర్థిక వ్యవస్థపై కరోనా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ఆయన కార్యనిర్వహక ఉత్తర్వులు జారీచేశారు. కనబడని శత్రువు దాడి నుంచి తప్పించుకునేందుకు, అలాగే అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడుకునేందుకు తమ దేశంలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు  ట్రంప్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

మరోవైపు కరోనా వైరస్‌కు సంబంధించి చైనాపై ట్రంప్‌ నిప్పులు చెరుగుతున్నారు. మహమ్మారి కరోనా ఎక్కడ? ఎలా? పుట్టుకొచ్చిందో కనుగొనేందుకు చైనాకు నిపుణుల బృందం పంపనున్నట్లు ట్రంప్‌ సోమవారం వెల్లడించారు. కరోనా చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆయన‌ మరోమారు అసహనం వ్యక్తం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తమకు సాయం చేసేందుకు జిన్‌పింగ్‌ ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. కాగా, ఇప్పటికే కరోనా కారణంగా అమెరికాలో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 7.75 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దాదాపు 42 వేలకు పైగా మృతిచెందారు.

మరిన్ని వార్తలు