-

మరో బాంబు పేల్చిన ట్రంప్‌

3 Jan, 2018 11:43 IST|Sakshi

వాషింగ్టన్‌ : ట్విటర్‌ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వరుస మంటలు పుట్టిస్తున్నారు. పాకిస్తాన్‌ను నిధులు నిలిపివేయడంతో పాటు సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్‌.. తాజాగా పాలస్తీనాను లక్ష్యంగా చేసుకున్నారు. ఇజ్రాయిల్‌ రాజధానిగా జెరూసలేను గుర్తించే విషయంపై ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో.. పాలస్తీనాకు నిధులు నిలిపేస్తామంటూ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

వరుస ట్వీట్లతో ఆ దేశంపై విరుచుకుపడ్డారు. ప్రతి ఏడాది వందల మిలియన్‌ డాలర్ల సహాయాన్ని తీసుకుంటూ.. అమెరికాపై ఏ మాత్రం గౌరవం చూపడం లేదని అన్నారు. ఇజ్రాయిల్‌తో శాంతి చర్చలను కొనసాగించేందుకు సూతం పాలస్తీనా అథారిటీ ఆసక్తి చూపడం లేదన్నారు. పాలస్తీనా అథారిటీ శాంతిని కోరుకోవడం లేదు.. అటువంటి పరిస్థితుల్లో వారికి సహాయ నిధులు అందించాల్సిన అవసరం లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. 

అగ్రరాజ్యం ప్రతి ఏడాది పాలస్తీనా అథారిటీకి 300 మిలియన్‌ డాలర్ల సహాయాన్ని అందిస్తోంది. అదే ఇజ్రాయిల్‌కు 3.1 బిలియన్ల సైనిక సహాయం చేస్తోంది. దీనిని వచ్చే ఏడాది నుంచి 3.8 బిలియన్‌ డాలర్లకు పెంచుతంది. ఇదిలావుండగా.. జెరూసలేం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనా అథారిటీ అగ్రరాజ్యం నుంచి తమ రాయబారిని వెనక్కు పిలిపించింది. 

మరిన్ని వార్తలు