ఆ దేశాలపై అమెరికా ఆంక్షలు

2 Feb, 2020 04:27 IST|Sakshi

ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం

వాషింగ్టన్‌: గతంలో చెప్పినట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమైన దేశాల పౌరుల వీసా అనుమతులపై ఆంక్షలు విధించే పత్రంపై సంతకం చేశారు. ఇవి అమెరికా భద్రతకు ప్రమాదకరంగా మారాయని ఆయన వైట్‌ హౌస్‌ వెల్లడించింది. ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సిరియా, వెనెజులా, యెమన్, సోమాలియా పౌరుల అమెరికా ప్రవేశంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తూ ప్రకటన విడుదల చేసింది. మయన్మార్, ఎరిట్రియా, కిర్గిజిస్తాన్, నైజీరియా వలసదారులకు వీసాల అనుమతిపై నిషేధం విధించింది. సూడాన్, టాంజానియా దేశాలు వీసా లాటరీలో పాల్గొనే అవకాశాన్ని రద్దు చేస్తూ వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ స్టెఫానియా గ్రెషమ్‌ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఆంక్షలేవీ పర్యాటకులకు, వ్యాపారస్తులకు, వలసేతర ప్రయాణికులకు వర్తించవనిన్నారు. అంతర్జాతీయ భద్రతా నిబంధనలను పాటించకుంటే ఎలా ఉంటుందో ఆయా దేశాలకు అర్థమయ్యేందుకే ఈ నిషేధమని యాక్టింగ్‌ సెక్రటరీ చాడ్‌ ఎఫ్‌ వోల్ఫ్‌ వెల్లడించారు. ‘దేశ భద్రత, ప్రజల రక్షణే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రథమ బాధ్యత అనీ, ఈ ఆంక్షలు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాయని’ వోల్ఫ్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు