2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధం: ట్రంప్‌

6 Jun, 2020 12:02 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. నానాటికీ కేసుల సంఖ్య తీవ్రరూపం దాల్చుతూ మానవ మనుగడను ప్రమాదంలోకి నెట్టివేస్తోంది. ముఖ్యంగా కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. అమెరికాలో ప్రస్తుతం 1.87 మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు 108,120 మంది మరణించారు. దేశంలో కోవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇప్పటికే 2 మిలియన్ల కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు ట్రంప్‌ వెల్లడించారు. వీటికి భద్రతా పరిశోధనలు పూర్తి అయితే ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ('ఆయన నాపై అత్యాచారం చేశారు')

‘వ్యాక్సిన్‌పై నిన్న అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించాం. కరోనా టీకా‌ తయారీలో అద్భుత పురోగతి సాధిస్తున్నాం. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో సానుకూల ఫలితాలు అందుతున్నాయి. భద్రతాపరమైన పరీక్షలు కొనసాగుతున్నాయి. అవి పూర్తయితే దాదాపు 2 మిలియన్లకు పైగా వాక్సిన్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం’. అని పేర్కొన్నారు. అదే విధంగా కరోనా నియంత్రణ చర్యల్లో తాము చాలా బాగా పని చేస్తున్నామని, వైరస్‌ను ఎదుర్కోవడంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. (జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి)

కరోనావైరస్ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసేందుకు ట్రంప్ పరిపాలన విభాగం అయిదు కంపెనీలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏ కంపెనీ వ్యాక్సీన్‌ తయారీని ప్రారంభించిందనే విషయం మాత్రం తెలీదు. ఈ విషయంపై వైట్ హౌస్ ఆరోగ్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఇటీవల మాట్లాడుతూ.. కరోనాకు నేరుగా లేదా పరోక్షంగా ఉపయోగించే కనీసం నాలుగు వ్యాక్సిన్ల ట్రయల్స్‌ జరుగుతున్నాయన్నారు. 2021 ప్రారంభం నాటికి రెండు లేదా మూడు మిలియన్ వ్యాక్సిన్‌లను కలిగి ఉండగలమని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ దశల్లో అనేక పరిశోధనలు జరిపిన తర్వాత శాస్త్రవేత్తలు టీకా అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారన్నారు. 
(అమెరికాలో కొత్తగా 2.5 మిలియన్‌ ఉద్యోగాలు!)

>
మరిన్ని వార్తలు