వాషింగ్టన్ : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రోజు రోజుకి కవ్వింపు చర్యల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్పై దాడి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని చివరి నిమిషంలో ఆగిపోయినట్లు తెలుస్తోంది. తమ గగనతలంలోకి అమెరికా నిఘా డ్రోన్ వచ్చినందుకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ ఆ డ్రోన్ను కూల్చివేసింది. దీంతో గురువారం ట్రంప్ ఇరాన్పై దాడి చేయాలని నిర్ణయం తీసుకున్నటికీ చివరికి వెనక్కి తగ్గారు.
అయితే ఇరాన్పై దాడి చేయాలనే ఆలోచన ప్రభుత్వానిదా.. మిలటరీదా అనేది తెలియాల్సి ఉంది. ఇరాన్ రాడార్ , మిస్సైల్ బ్యాటరీలపై అమెరికా శుక్రవారం దాడికి పాల్పపడటానికి సిద్ధపడినా ట్రంప్ ఆదేశాల మేరకు బలగాలను నిలిపివేసినట్టు సమాచారం. కాగా ఒబామా పాలనా కాలంలో ఇరాన్తో జరిగిన అణు ఒప్పందాన్ని ట్రంప్ సర్కారు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా- ఇరాన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.