సంచలనం.. ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ల జైలు శిక్ష

12 Apr, 2018 17:38 IST|Sakshi

దుబాయ్ : యూఏఈలోని దుబాయ్ స్పెషల్ బెంచ్ కోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. 200 మిలియన్‌ డాలర్ల చీటింగ్‌ కేసులో ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ దుబాయ్‌ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇందులో భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తికి కూడా 517 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి డాక్టర్‌ మొహమ్మద్ హనాఫీ ఆదివారం తీర్పు వెల్లడించారు. గోవాకు చెందిన సిడ్నీ లెమోస్, అతడి భార్య వలనీ, రేయాన్ డీసౌజాలు, ఎసెన్షియల్ ఫారెక్స్‌ను నిర్వహించి సుమారు 200 మిలియన్ల డాలర్ల మోసానికి పాల్పడినట్టు దుబాయ్‌ న్యాయస్థానం నిర్ధారించింది.

నిందితుల్లో ఒక్కొక్కరిపై 500పైగా కేసులు నమోదయ్యాయని, లక్షల డాలర్ల మోసాలకు పాల్పడ్డారని, అభియోగాలు అన్నీ రుజువయ్యాయని న్యాయమూర్తి హనాఫీ వెల్లడించారు. తీర్పు వెలువరించే సమయంలో వందలాదిమంది బాధితులు అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా దోషుల నుంచి నగదు స్వాధీనం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. వారిపై మోపిన అభియోగాలు, తీర్పు ప్రతులను చదవడానికి న్యాయమూర్తికి 10 నిమిషాలకు పైగా సమయం పట్టింది.

మరిన్ని వార్తలు