‘నా కూతుర్ని కిడ్నాప్‌ చేసి తీసుకుపోయాడు’

27 Dec, 2016 12:36 IST|Sakshi
‘నా కూతుర్ని కిడ్నాప్‌ చేసి తీసుకుపోయాడు’

ఆంస్టర్‌ డామ్‌: ప్రేమకథలన్నీ సుఖాంతం కావు. ఆంస్టర్‌ డామ్ కు చెందిన నదియా అనే మహిళకు ప్రేమ వివాహం పీడకలగా మారింది. తన విషాదగాధను హ్యుమన్స్‌ ఆఫ్‌ ఆంస్టర్‌ డామ్ పేజీలో ఆమె పంచుకుంది. భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తనకు చివరకు తీరని వేదన మిగిలిందని తెలిపింది. పెళ్లైన తర్వాత వేధింపులు మొదలయ్యాయని, చివరకు తన రెండేళ్ల కూతుర్ని దూరం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమార్తె కోసం న్యాయపోరాటం చేస్తున్నానని వెల్లడించింది.

‘‘ఆంస్టర్‌ డామ్ లో జరిగిన ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల వేడుకలో మొదటిసారి అతడితో పరిచయం అయింది. అప్పటి నుంచి ఫోన్లో తరచుగా మెసేజ్‌ లు పంపేవాడు. 2010లో అతడు మా ఇంటికి వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. అతడి గురించి పూర్తిగా తెలియదని చెప్పి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించాను. అక్కడితో అతడు వదల్లేదు. ఫోన్లో మెసేజ్‌ లు పంపుతూనే ఉండేవాడు. తరచుగా ఆంస్టర్‌ డామ్ వచ్చి నన్ను కలుసుకునే వాడు. మరోసారి ప్రపోజ్‌ చేయడం అతడితో ప్రేమలో పడ్డాను. 2011లో మా పెళ్లి జరిగింది.

పెళ్లైన తర్వాత జీవితం తలకిందులైంది. నా భర్త వేధించడం మొదలు పెట్టాడు. మా పాప ఇన్సియా పుట్టిన తర్వాత కూడా అతడి ప్రవర్తన మారలేదు. దీంతో విడాకుల కోసం దరఖాస్తు చేశాను. నన్ను చంపుతానని బెదిరించాడు. నేను భయపడకపోవడంతో సెప్టెంబర్‌ 29న మా పాపను కిడ్నాప్‌ చేసి ముంబై తీసుకెళ్లిపోయాడు. నా కూతురితో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా కుదరలేదు. విదేశాంగ శాఖ, డచ్‌ ప్రభుత్వం సహకారంతో ఇన్సియాను నా దగ్గరకు తెచ్చుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నా’నని నదియా వెల్లడించింది.

మరిన్ని వార్తలు