చంద్రుడొక్కడే కాదు..!

7 Nov, 2018 19:31 IST|Sakshi

ముగ్గురు చంద్రుళ్లున్నారని తేల్చిన పరిశోధన

భూ గ్రహానికి ఒక ఉపగ్రహం మాత్రమే ఉందనీ.. అది చంద్రుడనీ అందరికీ తెలుసు. మనం అనుకుంటున్నట్టు భూమికి చంద్రుడితో పాటు మరో రెండు ఉపగ్రహాలున్నాయనీ హంగేరీకి చెందిన ఆస్ట్రనామర్లు, భౌతిక శాస్త్రవేత్తలు తేల్చారు. దట్టమైన దుమ్మూ, ధూళితో కూడిన చంద్రుని వంటి నిర్మితాలు రెండు భూమికి ఉపగ్రహాలుగా ఉన్నాయనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు వెల్లడించారు. దీంతో 50 ఏళ్ల క్రితం మొదలైన ‘చంద్ర పరిశోధన’ లకు ఫలితం దక్కినట్టయింది.

కాగా, రాయల్‌ ఆస్ట్రనామికల్‌ సొసైటీ ఈ పరిశోధనలపై కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. భూమికి ఉపగ్రహాలుగా మరో రెండు చంద్రుళ్లున్నాయని నిరూపించేందుకు అవసరమైన డేటా హంగేరీయన్‌ శాస్త్రవేత్తల వద్ద ఉంది. దుమ్మూ, ధూళితో నిర్మితమైయున్న ఈ పదార్థాలు భూమి కంటే 9 రెట్లు వెడల్పుగా ఉంటాయని వెల్లడైంది. అనగా ఈ నిర్మితాలు భూమికంటే 45 వేల నుంచి 65 వేల మైళ్ల వెడల్పుంటాయి.

కొన్ని ముఖ్య విషయాలు..
చంద్రుణ్ని పోలిన నిర్మాణాలు అంతరిక్షంలో ఉన్నాయనీ, అవి భూమి చుట్టూ తిరుగుతున్నాయనే అంచనాలు 1961లోనే మొదలయ్యాయి. పోలండ్‌కు చెందిన ఆస్ట్రనామర్‌ కజిమియర్జ్‌ కార్డ్లీస్కీ దుమ్మూధూళితో కూడిన చంద్రుణ్ని పోలిన నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. ఈయన పేరుమీదనే వాటిని కార్డ్లీస్కీ మేఘాలుగా పిలుస్తున్నాం. కాగా, తాజాగా వెలుగుచూసిన కార్డ్లీస్కీ మేఘాలు తేలికపాటి దుమ్ము, ధూళి అణువులతో నిర్మితమై ఉన్నందున పెద్దగా బరువుండవు.

కానీ, సూర్యకిరణాలు ఈ మేఘాలపై పడినప్పుడు అవి కాంతిమయమవుతాయని రాయల్‌ సొసైటీ తెలిపింది. ఈ నిర్మితాలు చంద్రుని కన్నా భూమికి దగ్గరగా ఉన్నా.. సూర్యుడు, నక్షత్రాలు, అంతరిక్ష వెలుతుర్ల కారణంగా మనకు కనిపించడం లేదని ఈ రిపోర్టు వెల్లడించింది. కార్డ్లీస్కీ మేఘాలు తరచూ మార్పులకు లోనవుతాయి. ఇవి ఒకే క్షక్ష్యలో తిరుగుతూ వేల సంవత్సరాలు ఉనికిలో ఉంటాయి. అయితే తేలికపాటి పదార్థాలతో నిర్మితమైనందున వాటిలో అంతర్గంతంగా ఉన్న అణువులు ఒకదాన్నొకటి రాసుకూంటూ ఉంటాయని కథనం ప్రచురించింది. కాగా, కార్డ్లీస్కీ మేఘాలు అంతరిక్ష ప్రయోగాలకు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మరిన్ని వార్తలు