ఘోర రైలు ప్రమాదం.. భయానక వాతావరణం

12 Aug, 2017 15:47 IST|Sakshi
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం

కైరో: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లోకల్ రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 36 మంది ప్రాణాలు కోల్పోగా, 120 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈజిప్టు ఉత్తరతీరంలోని అలెగ్జాండ్రియాలో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

ఎదురెదురుగా వచ్చిన రెండు లోకల్ రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల రాజధాని కైరో నుంచి వస్తున్న రైలు ఆగి ఉండగా మరో రైలు వచ్చి ఢీకొట్టిందని రవాణాశాఖ పేర్కొంది. విచారణకు ఆదేశించినట్లు ఆశాఖ మంత్రి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగనుందని సమాచారం.

మౌమెన్ యూసఫ్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ.. క్షణాల్లో రైళ్లు ఢీకొనడం జరిగిపోయింది. కళ్లు తెరచి చూసే సరికి కిందపడిపోయి ఉన్నాను. అంబులెన్స్‌లు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలిస్తున్నాయి. ఘటనా స్థలం భయానక వాతావరణాన్ని తలపించిందని వివరించాడు.

మరిన్ని వార్తలు