ట్రేడ్‌ వార్‌: అమెరికాకు మరో గట్టి షాక్‌

22 Jun, 2018 11:52 IST|Sakshi
యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడే జంకర్,అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ (పాత ఫోటో)

లండన్‌: ఏకపక్ష నిర్ణయాలతో ట్రేడ్‌వార్‌ అందోళన  రేపుతున్న అమెరికాకు  వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుసగా ఒక్కోదేశం  అమెరికా టాక్స్‌ విధింపులను తిప్పికొట్టే చర్యలకు దిగుతున్నాయి.  ఇప్పటికే  భారతదేశం అమెరికా  ఉత్పత్తులపై దిగుమతి  సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా అమెరికా ప్రభుత్వానికి  మరో షాక్‌ తగిలింది. సుంకాలను పెంచుతామని ట్రంప్ తొలుత ప్రతిపాదించినప్పుడే తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామని హెచ్చరించిన యూరోపియన్ యూనియన్ ఇపుడు అన్నంత పనీ చేసింది.  అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది.  3.2 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులపై టారిఫ్‌లను శుక్రవారం నుంచి అమలు   చేయనున్నట్టు వెల్లడించింది.

విస్కీ, పొగాకు, హార్లీ డేవిడ్‌ సన్‌ బైక్స్‌, కాన్‌బెర్రీ, పీనట్‌ బటర్‌లాంటి  అమెరికా ఉత్పత్తులపై 25శాతం  దిగుమతి సుంకాన్ని  పెంచింది. దీంతోపాటు పాదరక్షలు, కొన్నిరకాల దుస్తులు, వాషింగ్‌ మెషీన్లు తదితర ఎంపిక  చేసిన కొన్ని అంశాలపై  50శాతంకాదా  టాక్స్‌ను పెంచింది.  యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడే జంకర్ గురువారం రాత్రి ఐరిష్ పార్లమెంటులో  మాట్లాడుతూ  కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు చెప్పారు.  సుంకం విధింపులతో అమెరికా చట్టవిరుద్ధంగా, చరిత్రకువిరుద్ధగా పోతోందని  వాఖ్యానించారు.  అమెరికా  యుఎస్ సుంకాల నేపథ్యంలో తమ ప్రతిస్పందన స్పష్టంగా ఉంటుందున్నారు. అటు భారత్‌ అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయించింది. ఆగస్టు నుంచి ఈ పెంచిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.

కాగా ఉక్కు దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలను భారీగా పెంచి వాణిజ్య యుద్ధానికి తెర లేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై ఇతర దేశాలను కూడా బెదిరిస్తున్నారు. ఈ సుంకాలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతీకార చర్యలకు దిగితే యూరప్ దేశాలకు చెందిన కార్లపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతామని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు