ఆలోచిస్తే చాలు... ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పెడుతుంది!

14 Jul, 2014 00:41 IST|Sakshi
ఆలోచిస్తే చాలు... ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పెడుతుంది!

కళ్లజోడుతో హ్యాండ్స్ ఫ్రీ కంప్యూటర్‌గా.. పేరుపొందిన గూగుల్ గ్లాస్‌కు మరో కొత్త హంగు వచ్చి చేరనుంది. గూగుల్ గ్లాస్‌ను పెట్టుకుని ఓ దృశ్యాన్ని చూస్తూ జస్ట్ ఆలోచిస్తే చాలు.. గూగుల్ గ్లాస్ ఆ దృశ్యాన్ని క్లిక్‌మనిపించడంతో పాటు దానిని ఫేస్‌బుక్‌లో కూడా పోస్టు చేయనుంది. ఇందుకు ఉపయోగపడే ‘మైండ్‌ఆర్‌డీఆర్’ అనే మొబైల్ అప్లికేషన్‌ను లండన్‌కు చెందిన ‘దిస్ ప్లేస్’  కంపెనీ అభివృద్ధిపర్చింది. సెన్సర్‌తో కూడిన చిన్న హెడ్‌సెట్‌తో ఈ యాప్ పనిచేస్తుంది.

ఈ హెడ్‌సెట్ ధరించినవారి మెదడులో తరంగాలను విశ్లేషిస్తుంది. మనం గూగుల్ గ్లాస్ పెట్టుకుని ఏదైనా ఓ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు గ్లాస్ తెరపై కనిపించే దృశ్యంపై ఓ గీత ప్రత్యక్షమవుతుంది. ఆ గీతను అలాగే చూస్తూ ‘ఫొటో తీసుకోవాలి. ఫేస్‌బుక్‌లో పోస్టు చేయాలి’ అని అనుకుంటే చాలు.. ఆటోమేటిక్‌గా ఫొటోను క్లిక్‌మనిపించి ఇది ఫేస్‌బుక్‌లో పోస్టు చేసేస్తుందని దిస్ ప్లేస్ క్రియేటివ్ డెరైక్టర్ క్లూ కిర్టన్ చెబుతున్నారు. శారీరక వికలాంగులు, ఇతర లోపాలు ఉన్నవారికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే.. ఈ యాప్‌ను వాడేందుకు గూగుల్ గ్లాస్‌వారు ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది.
 
 

మరిన్ని వార్తలు