ఫేస్‌బుక్‌ జర్నలిస్టులను నియమించుకుంటోంది!

21 Aug, 2019 09:00 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను ప్రవేశపెడుతున్న ఫేస్‌బుక్‌ మరో కొత్త ఫీచర్‌ను త్వరలోనే అందించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాలకు విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో వినియోగదారులకు ఫేస్‌బుక్‌లోనే వార్తల్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ‍్యంలో తన న్యూస్‌ ట్యాబ్‌కోసం సీనియర్‌ జర్నలిస్టుల  బృందాన్ని నియమించుకోనుంది. 

న్యూస్ టాబ్ ఫీచర్‌ ఆవిష్కరణను ధృవీకరించిన సంస్థ అనుభవజ్ఞులైన జర్నలిస్టుల పర్యవేక్షణలో తమ న్యూస్‌ఫీడ్‌ ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది.  ఒక​ బృందం ఆధ్వర్యంలో విశ్వసనీయయైన, బ్రేకింగ్‌, టాప్‌​ వార్తా కథనాలను ఎన్నుకుంటామని తెలిపింది. వినియోగదారు అభిరుచులను గుర్తించడానికి అల్గారిథమ్‌లపై ఆధారపడతామని పేర్కొంది. ప్రజలకు వ్యక్తిగతీకరించిన, అత్యంత సందర్భోచితమైన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని ఫేస్‌బుక్ న్యూస్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ క్యాంప్‌బెల్ బ్రౌన్మీడియాకు వెల్లడించారు. సరైన కథనాలనే హైలైట్ చేస్తున్నామని నిర్ధారించుకునేందుకు పాత్రికేయుల బృందాన్ని తీసుకుంటు న్నప్పటికీ , ప్రజల ఆసక్తిని ఎక్కువ భాగం సాఫ్ట్‌వేర్ ద్వారానే గుర్తిస్తామని తెలిపింది. 

కాగా మెరుగైన, విశ్వసనీయ సమాచారాన్ని యూజర్లకు అందించాలనే లక్ష్యంతోనే ఈ కొత్త న్యూస్‌ ఫీచర్‌ని తీసుకొస్తున్నామని ఈ ఏడాది ఆరంభంలో ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు.  ఫేక్‌ న్యూస్‌ పై ప్రపంచవ్యాప్తంగా భారీగా ఒత్తిడి వస్తున్న క్రమంలో వీటి నిరోధంపై తీవ్ర కసరత్తు చేస్తోంది.

మరిన్ని వార్తలు