ఫేస్‌బుక్‌ లైవ్‌పై ఆంక్షలు

16 May, 2019 04:01 IST|Sakshi

పారిస్‌: తమ లైవ్‌ స్ట్రీమింగ్‌ వీడియోలపై పలు ఆంక్షలు విధించనున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. తీవ్రవాదం, విద్వేషాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా వ్యాప్తి చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. ‘క్రైస్ట్‌చర్చ్‌’మసీదు కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో తీవ్రవాదం పెచ్చుమీరకుండా ఉండేందుకు ఆ సంస్థలపై న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డర్న్, ఫ్రెంచ్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌లు ప్రపంచవ్యాప్తంగా ‘క్రైస్ట్‌చర్చ్‌’పిలుపునివ్వాలని సిద్ధమవుతున్నారు.

మార్చిలో శ్వేత జాతీయుడు క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ మసీదులో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 51 మంది చనిపోయారు. కాల్పులు జరుపుతూ దుండగుడు ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్‌ చేశాడు. అప్పటినుంచి చర్యలు తీసుకోవాల్సిందిగా జుకర్‌ బర్గ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరిగింది. దీంతో ఫేస్‌బుక్‌ వినియోగదారులు తీవ్రవాద సంబంద వీడియోల లైవ్‌పై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. ‘న్యూజిలాండ్‌లో జరిగిన మారణహోమం తర్వాత తీవ్రవాదం వ్యాప్తిచేసేందుకు ఫేస్‌బుక్‌ను వాడుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపాం’అని ఫేస్‌బుక్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు