కరోనా  : ఫేస్‌బుక్ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ 

18 Mar, 2020 15:13 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

ఉద్యోగులకు  భారీ బోనస్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచం మొత్తం కరోనా కోరలకు చిక్కి విలవిల్లాడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ ఉద్యోగులకు కరోనా వైరస్  బోనస్ అందించనున్నట్లు ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌  ప్రకటించారు. 45 వేల మంది  ఉద్యోగులకు  రూ. 74,037 (1,000 డాలర్లు)నగదును బోనస్‌గా అందించనుంది.  కోవిడ్‌ -19 (కరోనా వైరస్)  మహమ్మారి విస్తరిస్తున్న​ నేపథ్యంలో ఇంటి వద్ద నుంచే పని చేస్తున్న ఉద్యోగుల  శ్రమను గుర్తించి జుకర్ బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన ఉద్యోగులకు అంతర్గత నోట్‌లో ఈ ప్రకటన చేశారు. ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు,పిల్లలు, తదితర ఊహించని అదనపు ఖర్చులతో రిమోట్‌గా పనిచేసే వారికి చెల్లించనుంది. ఎంతో శ్రమిస్తున్న ఉద్యోగులకు ఇలాంటి సమాయాల్లో బోనస్ ప్రకటించడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నట్లు సీఈఓ జుకర్ బర్గ్ ఉద్యోగులకు రాసిన లేఖలో వెల్లడించారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుల్‌ టైం ఉద్యోగులకు ఈ బోనస్‌ వర్తించనుంది.

కాగా ఫేస్‌బుక్‌తో పాటు, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక ఇతర టెక్ దిగ్గజాలు కరోనావైరస్ కారణంగా ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని ప్రోత్సహిస్తున్నాయి. మార్చి 4 న,  ఫేస్‌బుక్‌ సీటెల్ కార్యాలయంలో ఒక కాంట్రాక్టర్ కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారించింది.  అలాగే కరోనా  వ్యాప్తిని  అడ్డుకునే చర్యల్లో భాగంగా  ఫిబ్రవరి 27న నిర్వహించాల్సిన వార్షిక సాఫ్ట్‌వేర్ డెవలపర్ల సమావేశాన్ని  కూడా  పేస్‌బుక్‌ రద్దు చేసింది. మరోవైపు కరోనా వైరస్‌తో ఇప్పటికే  7,987 మంది చనిపోగా,  1 లక్ష మందికి పైగా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు