ఇకపై ఫేస్‌బుక్‌లో వార్తలు

20 Oct, 2019 04:43 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇకపై ఫేస్‌బుక్‌లో మిత్రులు, బంధువుల పోస్టులతో పాటు వార్తలు సైతం కనిపిస్తాయి. ఫేస్‌బుక్‌ అధికారికంగా తెస్తున్న ఈ వార్తలను ప్రత్యేక ఫీడ్‌ (ట్యాబ్‌)లో ఉంచనుంది. వార్తలను వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌కు చెందిన పబ్లిషర్‌ న్యూస్‌ కార్ప్‌ నుంచి వచ్చేలా చర్యలు తీసుకోనుంది. రానున్న కొద్ది వారాల్లో దీనికి సంబంధించిన అప్‌డేట్‌ రానుంది. ఈ మేరకు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ కో ఫౌండర్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. జర్నలిజం విలువను గుర్తించినందుకు ఫేస్‌బుక్‌కు క్రెడిట్‌ దక్కుతుందని న్యూస్‌ కార్ప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాబర్ట్‌ థామ్సన్‌ అన్నారు. ఈ వార్తాసంస్థతో ఉన్న ఒప్పంద విలువ మాత్రం బయటకు రాలేదు.

ఫీడ్‌లో ఏ వార్తలు టాప్‌లో ఉండాలో ఒక బృందం నిర్ణయిస్తుంది. ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్‌లో ఫేక్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతూ పలువురి ప్రాణాలు బలిగొంటున్న సంగతి తెలిసిందే. ఇటువంటి ఫేక్‌ న్యూస్‌ను అధికారిక వార్తా సంస్థల ద్వారా వచ్చే వార్తలతో అడ్డుకట్ట వేయవచ్చని పలువురు టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాల ధాటికి వార్తా సంస్థలకు వినియోగదారులు రోజురోజుకూ కొంత తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సమస్యలకు ఇది పరిష్కారమార్గమని కూడా నిపుణులు చెబుతున్నారు. ఫేస్‌బుక్‌లో యూజర్‌ ఇంటరెస్ట్‌ ఆధారంగానే పలు పోస్టులు వచ్చినట్లు.. యూజర్‌ ఇంటరెస్ట్‌ ఆధారంగానే వార్తలు కూడా ప్రత్యేక ఫీడ్‌(ట్యాబ్‌)లో కనిపించనున్నాయి.

>
మరిన్ని వార్తలు