అమ్మకానికి కస్టమర్ల డేటా!

13 Jan, 2019 04:00 IST|Sakshi

2012లో ఆ దిశగా ఫేస్‌బుక్‌ యత్నం, తర్వాత విరమణ

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్‌ తన వినియోగదారుల సమాచారాన్ని విక్రయించాలని 2012లో అనుకుందని ఓ మీడియా  సంస్థ తన కథనంలో వెల్లడించింది. ఫేస్‌బుక్‌కు చెందిన గ్రాఫ్‌ ఏపీఐలో వినియోగదారుల సమాచారం భారీస్థాయిలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ గ్రాఫ్‌ ఏపీఐలోని వివరాలు/సమాచారాన్ని పొందేందుకు కంపెనీల నుంచి కనీసం రెండున్నర లక్షల డాలర్లు వసూల చేయాలని ఫేస్‌బుక్‌ 2012లో భావించిందని అర్స్‌టెక్నికా అనే సంస్థ బయటపెట్టింది.

2014లో ఫేస్‌బుక్‌ ఆ నిర్ణయానికి కొన్ని మార్పులు చేసిందనీ, 2015 నాటికి గ్రాఫ్‌ ఏపీఐలోని కొద్ది సమాచారం మాత్రమే కంపెనీలకు అందుబాటులో ఉండేలా మార్పులు చేసిందని తెలిపింది. కోర్టుకు చేరిన ఓ పత్రం నుంచి సమాచారాన్ని సేకరించి అర్స్‌టెక్నికా ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రాఫ్‌ ఏపీఐ నుంచి విస్తృత స్థాయిలో సమాచారం పొందేందుకు నిస్సాన్, కెనడా రాయల్‌ బ్యాంక్, ఎయిర్‌బీఎన్‌బీ, నెట్‌ఫ్లిక్స్, లైఫ్ట్, క్రైస్లర్‌/ఫియట్‌ తదితర కంపెనీలు ఉన్నాయని అర్స్‌టెక్నికా తెలిపింది. ఓ కేసులో బ్రిటన్‌ పార్లమెంటు ఫేస్‌బుక్‌ అంతర్గత పత్రాలను పరిశీలన నేపథ్యంలో తాజా వార్త ఫేస్‌బుక్‌కు మరింత ఆందోళన కలిగించనుంది. 

>
మరిన్ని వార్తలు