‘దౌత్యవేత్తల కుటుంబసభ్యులకూ నో’

29 Jun, 2020 20:26 IST|Sakshi

కరోనా కలకలంతోనే!

సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం భారత్‌ నుంచి చైనా వెళ్లేందుకు దౌత్యవేత్తల కుటుంబ సభ్యులు సహా పలువురు భారతీయులను విమానంలోకి చైనా అనుమతించలేదు. జూన్‌ 21న భారత్‌ నుంచి షాంఘై వెళ్లిన ప్రత్యేక విమానంలో ఇద్దరు భారతీయులకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చైనా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు భారతీయులకు కరోనా సోకడంతో వారిని స్వదేశానికి తరలించేందుకు భారత్‌ నుంచి ఖాళీ ప్రత్యేక విమానాన్ని పంపేందుకు చైనా అధికారులు అనుమతించారు.

ఇక గ్వాంజు నగరం నుంచి 86 మంది భారతీయులతో వందే భారత్‌ మిషన్‌ మూడో దశలో భాగంగా భారత్‌కు బయలుదేరింది. జూన్‌ 21న షాంఘైకు చేరుకున్న విమానం కూడా చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకే వెళ్లింది. ప్రత్యేక విమానాల్లో దౌత్య పాస్‌పోర్టులు కలిగిన భారతీయులను సైతం చైనా అనుమతించకపోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య విమానాల పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. కాగా భారత్‌ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జూన్‌ 29న గ్వాంజు నగరానికి వచ్చే విమానంలో ప్రయాణీకులను అనుమతించరాదని ఇరు దేశాలు నిర్ణయించాయని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : వందే భారత్ మిషన్ : ఆ విమానాలకు బ్రేక్?

>
మరిన్ని వార్తలు