ఫీమేల్‌ డామినేషన్‌

21 Mar, 2018 21:56 IST|Sakshi

వియన్నాః ప్రపంచం వ్యాప్తంగా స్త్రీ వివక్ష గురించి విస్త్రుతంగా చర్చజరుగుతోన్న తరుణంలో ఆస్ట్రియాలో పురుష వివక్ష వార్తల్లోకెక్కింది. లింగ వివక్ష రుజువై ఆస్ట్రియా రవాణా మంత్రిత్వ శాఖలో పనిచేస్తోన్న పీటర్‌ ఫ్రాంజ్‌మేయర్‌ 300,000 పైగా యూరోలను నష్టపరిహారంగా పొందిన విషయాన్ని డై ప్రెస్‌ వార్తా పత్రిక ప్రకటించింది. ఆస్ట్రియా రవాణా మంత్రిత్వ శాఖలో పనిచేసే ఫ్రాంజ్‌మేయర్‌ అనే ఉద్యోగికి రావాల్సిన ప్రమోషన్‌ ని ఉర్సులా జెంచ్నర్‌ అనే మహిళకు కట్టబెట్టడంతో తాను పదోన్నతిని కోల్పోయానంటూ  2011లో కోర్టుకెక్కారు.

తను పదోన్నతి పొందలేకపోవడానికి వివక్షే కారణమనీ, జెంచ్నర్‌ అనే మహిళకి పదోన్నతినివ్వడంలో పక్షపాత వైఖరి అనుసరించారన్న ఫ్రాంజ్‌మేయర్‌ వాదనతో ఏకీభవించిన ఫెడరల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కోర్టు అతనికి నష్టపరిహారంగా 300,000 యూరోలను చెల్లించాలని ఫిబ్రవరిలో తీర్పునిచ్చినట్టు డై ప్రెస్‌ పత్రిక పేర్కొంది.  అయితే జెంచ్నర్‌కి పదోన్నతినిచ్చే సమయంలో నియామకానికి సంబంధించిన అన్ని నిబంధనలనూ పాటించామని ఆ సమయంలో రవాణా శాఖా మంత్రిగా ఉన్న సోషల్‌ డెమొక్రాట్‌ పార్టీకి చెందిన డోరిస్‌ బర్స్‌ వివరణ ఇచ్చారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేని కారణంగా, మహిళలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ పదోన్నతిని కల్పించినట్టు డోరిస్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు