పాక్‌–చైనా బస్సు ప్రారంభం

7 Nov, 2018 01:04 IST|Sakshi

భారత్‌ అభ్యంతరాలు బేఖాతరు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌–చైనాల మధ్య విలాసవంతమైన బస్సు సర్వీసును పాక్‌ అధికారులు ప్రారంభించారు. భారత్‌ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఈ లగ్జరీ బస్సు సోమవారం అర్ధరాత్రి లాహోర్‌లోని గుల్బెర్గ్‌ నుంచి చైనాలోని జిన్జియాంగ్‌ ప్రావిన్సులో కష్గర్‌ నగరానికి బయలుదేరింది. దాదాపు 4.38 లక్షల కోట్ల వ్యయంతో చైనా చేపట్టిన చైనా పాక్‌ ఆర్థిక కారిడార్‌(సీపీఈసీ)లో భాగంగా ఈ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ‘షూజా ఎక్స్‌ప్రెస్‌’ అనే ప్రైవేటు సంస్థ ఈ మార్గంలో లగ్జరీ బస్సులను నడపనుంది.

కేవలం 15 మంది ప్రయాణికులు మాత్రమే ఉండే ఈ బస్సు 36 గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకుంటుంది. పాక్‌ నుంచి చైనాకు వెళ్లేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.13,000 వసూలు చేయనున్నారు. అదే రాకపోకలకు ఒకేసారి టికెట్‌ బుక్‌ చేసుకుంటే రూ.23,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసు పాక్‌లో శని, ఆది, సోమ మంగళవారాల్లో బయలుదేరుతుంది.

అలాగే చైనా నుంచి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఈ బస్సు సర్వీసు లాహోర్‌కు చేరుకుంటుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) మీదుగా ఈ సర్వీసు వెళ్లడంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా, పాక్, చైనాలు దాన్ని ఖండించాయి. భారత్‌ ఆరోపణలను పాకిస్తాన్‌ తోసిపుచ్చింది. ఈ బస్సు సర్వీస్‌ ప్రారంభం కారణంగా కశ్మీర్‌ విషయంలో తమ దేశ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని చైనా పేర్కొంది.

మరిన్ని వార్తలు