చేపను మింగాడు.. అది ప్రాణం తీసింది!

8 Jul, 2019 13:15 IST|Sakshi

మనీలా: ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఊహించడం చాలా కష్టం. ఫిలిప్పీన్స్ నదిలో చేపలు పడుతూ ఓ వ్యక్తి ​అనుకోని ప్రమాదంలో మరణించాడు. 50 సంవత్సరాల ఆ వ్యక్తికి చేపలు పట్టడమే జీవనాధారం. చేపల వేటలో భాగంగా చేపను పట్టిన వెంటనే తన దంతాలతో నొక్కి పట్టుకోవడం అలవాటు. ఆ అలవాటే అతని ప్రాణాన్ని తీసింది. దంతాల మధ్య ఉంచుకున్న టిలాపియా రకం చేపను ప్రమాదవశాత్తు మింగడంతో శ్వాసరంధ్రాలు మూసుకుపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

బాధితున్ని స్థానికులు గుర్తించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ అ‍ప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. స్థానికుల వివరాల ప్రకారం బాధితుడు రోజర్ మార్సెలినోగా గుర్తించారు. గత నెల 29న సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌లోని పురాతన ప్రావిన్స్‌ బుంగాసోంగ్ పట్టణంలో టాగుటుడ్ గ్రామం వద్ద నదిలో చేపలు పట్టడానికి వెళ్లినట్లు అతని కొడుకు తెలియజేశాడు. తన తండ్రికి చేపను పట్టిన వెంటనే దంతాల మధ్య ఉంచకోవడం అలవాటని, అయితే ఈసారి పొరపాటుగా చేపను మింగడంతో మరణించినట్లు తెలిపాడు.

మరిన్ని వార్తలు