ఫ్రాన్స్‌ స్కూళ్లలో స్మార్ట్‌ఫోన్‌పై నిషేధం

8 Mar, 2019 18:30 IST|Sakshi

ప్యారిస్‌ : స్మార్ట్‌ఫోన్.. స్మార్ట్‌ఫోన్.. స్మార్ట్‌ఫోన్.. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దోళ్ల దాకా ప్రతి ఒక్కరూ వీటికి బానిసలైపోయారు. ఇవి లేకపోతే జీవితమే వ్యర్థం అనుకునే స్థాయికి వచ్చేశాం. అయితే ఇప్పుడిప్పుడే వీటి వల్ల పొంచి ఉన్న ప్రమాదాల గురించి హెచ్చరికలు ఊపందుకుంటున్నాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు స్మార్ట్‌ ఫోన్లకు బానిసలు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

అయితే ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్రాన్స్‌ కూడా ఇప్పుడు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 15 ఏళ్ల లోపు స్కూల్ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్ అవరణలో సెల్ ఫోన్ ఉపయోగించకూడదని నిషేదం విధించింది. అది భోజన సమయమైన కూడా అంతే. దీని కోసం ఆ దేశం ఒక చట్టమే తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌వాచ్‌లు వంటివి వేటిని కూడా వాడరాదు. స్కూల్‌లో క్లాస్ సమయంలో ఫోన్లు వాడకూడదనే చట్టం అక్కడ 2010 నుంచే అమల్లోనే ఉంది. అయితే ఇప్పుడు బ్రేక్స్, మీల్‌టైమ్స్‌లో కూడా సెల్‌ఫోన్లను వాడరాదని చట్టం చేశారు. 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న విద్యార్థులకు కూడా పాఠశాలలు ఈ నిబంధనను అమలు చేసుకోవచ్చు. అయితే అది కచ్చితం మాత్రం కాదు. స్కూల్ యాజమాన్యం ఇష్టం. అయితే దివ్యాంగుల విషయంలో ఈ నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు ఫోన్లకు బానిసలైపోతున్నారని, వాటిపైనే ఎక్కువ ఆధారపడుతున్నారని ఆ దేశం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది.

మరిన్ని వార్తలు