రఫేల్‌ జెట్ల డెలివరీలో జాప్యం!

15 Apr, 2020 11:38 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా(కోవిడ్‌-19) విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలన్నీ దాదాపుగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలన్నీ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలు సహా ఇతర కార్యకలాపాలపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు చేరాల్సిన రఫేల్‌ యుద్ధవిమానాల సరఫరాలో జాప్యం నెలకొన్నట్లు తెలుస్తోంది. మహమ్మారి ధాటికి ఫ్రాన్స్‌లో 14 వేలకు పైగా మరణాలు సంభవిచంగా.. దాదాపు లక్షన్నర మంది దీని బారిన పడ్డారు. దీంతో మే 11 వరకు లాక్‌డౌన్‌ పొడిగించారు.

అదే విధంగా భారత్‌లోనూ మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంబాల ఎయిర్‌బేస్‌లో కొన్ని ముఖ్య పనులు నిలిచిపోవడం సహా.. ఫ్రాన్స్‌లోనూ వైరస్‌ తీవ్ర పరిణామాలు చూపుతున్న నేపథ్యంలో రఫేల్‌ డెలివరీకి మరికొన్ని వారాలు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు వెల్లడించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.(కరోనా: డబ్ల్యూహెచ్‌ఓకు షాకిచ్చిన ట్రంప్‌!)

కాగా ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన 36 రఫేల్‌ యుద్ధ విమానాలు త్వరలో వైమానిక దళంలో సేవలందించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి దశలో భాగంగా దాదాపు 17 స్వ్కాడ్రాన్లు మే చివరినాటికి డెలివరీ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొన్ని వారాలు గడిచిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా దాదాపు 60 వేల కోట్ల రూపాయలు వెచ్చించి రఫేల్‌​ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై భారత్‌లో తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే.(మే 11 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు)

మరిన్ని వార్తలు