పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ

21 Aug, 2019 15:17 IST|Sakshi
పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ

పారిస్‌: కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వివాదంగా చూపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పొరుగు దేశం పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఫ్రాన్స్‌ కూడా పాక్‌కు గట్టి షాకిచ్చింది. కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశమన్న తమ వైఖరికి కట్టుబడి ఉన్నామని ఫ్రాన్స్‌ మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశాన్ని చర్చల ద్వారా భారత్‌-పాక్‌ పరిష్కరించుకోవాలని సూచించింది.

ఫ్రెంచ్‌ విదేశాంగ మంత్రి జీన్‌ యెవ్స్‌ లీ డ్రియాన్‌తో పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ టెలిఫోన్‌లో మాట్లాడారు. కశ్మీర్‌ విషయంలో తమ వాదనకు మద్దతు ఇవ్వాలని ఫ్రాన్స్‌ను ఖురేషీ కోరారు. అయితే, ఇది ద్వైపాక్షిక అంశమన్న తమ వైఖరిలో మార్పు లేదని, ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలని లీ డ్రియాన్‌ సూచించారు. ఆర్టికల్‌370 రద్దు నేపథ్యంలో ఇరుదేశాలు సంయమనం పాటిస్తూ.. ఉద్రికత్తలు తగ్గించడానికి ప్రయత్నించాలని కోరారని ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

>
మరిన్ని వార్తలు