లండన్‌ బస్సులపై ఆ ప్రకటనలు.. పాక్‌కు దిమ్మతిరిగే షాక్‌!

14 Nov, 2017 16:54 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్ర్యం కోసం బలూచిస్థాన్‌ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘బలూచిస్థాన్‌కు విముక్తి కల్పించండి’ అంటూ లండన్‌ ప్రజారవాణా బస్సులపై భారీ పోస్టర్లు దర్శనమిచ్చాయి. దాదాపు వంద బస్సులపై ఈ భారీ పోస్టర్లు అంటించి వరల్డ్‌ బలూచ్‌ ఆర్గనైజేషన్‌ తన ప్రచారాన్ని ముమ్మరం చేయడం పాకిస్థాన్‌ ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా వరల్డ్‌ బలూచ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూబీవో) కార్యకలాపాలను నిషేధించేందుకు పాక్‌ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఏకంగా లండన్‌లోని ప్రజారవాణా బస్సులపై ఈ భారీ పోస్టర్లు దర్శనమివ్వడంతో పాక్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డబ్ల్యూబీవో ఈ ప్రచారాన్ని ఆపే ప్రసక్తి లేదని తెగేసి చెప్తోంది.

’బలూచిస్థాన్‌లో పాక్‌ సర్కారు సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనను బహిర్గతం చేసేందుకు, బలూచ్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటేందుకు లండన్‌లో మూడో దఫా ప్రచారాన్ని చేపట్టాం. ఇంతకుముందు లండన్‌లో మేం టాక్సీలపై ప్రకటనలు ఇచ్చాం. అనంతరం రోడ్డుపక్కన ఉండే బిల్‌బోర్ట్స్‌పై మా నినాదాన్ని చాటాం. ఇప్పుడు లండన్‌ బస్సులపై ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాం’ అని డబ్ల్యూబీవో అధికార ప్రతినిధి భవల్‌ మెంగల్‌ తెలిపారు. గతంలో డబ్ల్యూబీవో ఇదేవిధంగా ట్యాక్సీలపై నిర్వహించిన ప్రచారంపై పాకిస్థాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా ప్రచారంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు