చెవుల్లోనే పేలిపోయిన హెడ్‌ఫోన్స్‌

22 Feb, 2018 09:00 IST|Sakshi
లూయిసా పిన్హిరో (ఫైల్‌ ఫోటో)

చార్జింగ్‌ సమయంలో స్మార్ట్‌ఫోన్‌  వినియోగంపై జరిగే ప్రమాదాలపై యువతను ఎంత అప్రమత్తం చేసినా ఘోరమైన ప్రమాదాలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. హెడ్‌ఫోన్‌ యూజర్ల వెన్నులో వణుకు పుట్టించే  మరో ఉదంతం ఒకటి  బ్రెజిల్‌లో  చోటు చేసుకుంది. ఫోన్‌ చార్జింగ్‌లో ఉండగానే.. హెడ్‌ఫోన్‌ వాడుతుండగా  అనూహ్య ప్రమాదం జరిగింది. దీంతో బాధిత యువతి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

బ్రెజిల్లోని రియాస్ ఫ్రియోకి చెందిన లూయిసా పిన్హిరో(17) అపస్మారక స్థితిలో పడివుండగా  బాలిక అమ్మమ్మ గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  వైద్యులు  ఆమె జీవితాన్ని రక్షించలేకపోయారు. భారీ విద్యుత్‌ షాక్‌ వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. ఎలక్ట్రిక్‌ షాక్‌ తగిలిన గంట తరువాత అపస్మారక స్థితిలో ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారనీ , హెడ్‌ఫోన్స్‌  చెవుల్లో కరిగిపోయినట్లు  ఆస్పత్రి అధికార ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

కాగా ఛార్జ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ లేదా టాబ్‌లను వాడొద్దని అనేక ఫోన్ కంపెనీలు హెచ‍్చరిస్తునే ఉన్నాయి. అంతేకాదు చార్జింగ్‌లో ఉన్నపుడు ఫోన్‌ను వినియోగిస్తే..చార్జింగ్‌ వేగం తగ్గుతుందని కూడా  చెబుతున్నాయి.  అయినప్పటికీ ప్రపంచావ్యాప్తంగా ఈ తరహా ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్న కేసులు నమదవుతూనే ఉన్నాయి. దీనిపై  ఎవరికి వారు అప్రమత్తంగా  వ్యవహరించడం చాలా అవసరం.

మరిన్ని వార్తలు