ప్రకృతిపై ప్రేమే ప్రాణం తీసిందా!

30 Oct, 2019 17:05 IST|Sakshi

న్యూఢిల్లీ : లండన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న 29 ఏళ్ల హన్నా లోవ్‌కు పర్వత శిఖరాగ్రాలపై విహరించడమంటే ఇంతో ఇష్టం. అందుకోసం చిన్నప్పటి నుంచే కొండలు ఎక్కడం, దిగడంపై శిక్షణ కూడా తీసుకున్నారు. ఆమెకు ఆడమ్‌ స్టనావే అనే బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నారు. ఆయనకు కూడా కొండ కోనల్లో విహరించడం అంటే ఎంతో సరదా. అందుకనే ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చారు.

మొన్న సోమవారం నాడు ఇద్దరు కలిసి డెర్బ్‌శైర్‌లోని కిండర్‌ డౌన్‌ఫాల్‌కు వెళ్లారు. వారీ పర్యటనకు మరో విశేషం కూడా ఉంది. తెల్లవారితో మంగళవారం నాడు ఆడమ్‌కు 30 ఏళ్లు వస్తాయి. అతని పుట్టిన రోజును కొండల మధ్యనే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. స్వఫోర్డ్‌శైర్‌లోని ఎట్టెక్సటర్‌కు చెందిన హన్నా లోవ్‌ తన తల్లి, సోదరిని కూడా తీసుకెళ్లారు. కొండపై ఓ స్థానంలో తల్లి, సోదరి విశ్రాంతి తీసుకుంటుండగా, లోవ్, ఆడమ్‌తో కలిసి పర్వతం అంచు వరకు వెళ్లారు. ఇప్పటి వరకు తాము గడిపిన జీవితం చాలా చాలా ఆనందంగా ఉందని, త్వరలో పెళ్లి చేసుకొని ఇంతకంటే ఎక్కువ ఆనందంగా గడపాలని బాసలు చేసుకున్నారు.

అందుకు ఓ చిన్నపాటి ఇల్లును కూడా కొనుగోలు చేయాలనుకున్నారు. అందుకు ఎవరి వద్ద ఎంత డబ్బుందో లెక్కలు వేసుకున్నారు. బ్యాంకు నుంచి ఎంత రుణం అవసరం పడుతుందో కూడా అంచనా వేశారు. ఆ తర్వాత దిగువన కనిపిస్తున్న చిన్న వాటర్‌ ఫాల్‌ పై నుంచి అంచుల వరకు వెళ్లారు. ప్రకృతి అందాలను తిలకిస్తూ పక్కకు యథాలాపంగా అడుగేసిన హన్నా కాలుజారి లోయలోకి పడిపోయారు. తక్షణమే ఆడమ్‌ స్పందించినప్పటికీ లాభం లేకపోయింది. అమెను వెనక నుంచి పట్టుకోబోతే ఆమె భుజానున్న బ్యాగ్‌ అంచు తగిలిందని, పట్టు దొరకలేదని ఆడమ్‌ తెలిపారు. తాను కేకలు వేస్తు హన్నా తల్లిని, చెల్లెని తీసుకొని కిందకు వెళ్లికి చూడగా అప్పటికే హన్నా ప్రాణం పోయింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న లండన్‌ పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగానే కేసు నమోదు చేసుకున్నారు. పర్వతారోహరణలో ఎంత అనుభవం ఉన్నా చిన్న పొరపాటుకు ప్రాణాలు పోతాయి.

మరిన్ని వార్తలు