మహ్మద్‌ నషీద్‌కు ఊరట

16 Apr, 2018 18:35 IST|Sakshi
మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌

జెనీవా: మాల్దీవులు మాజీ ఆధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌కు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఊరటనిచ్చింది. నషీద్‌పై 16 సంవత్సరాల నిషేధాన్ని ఎత్తివేస్తూ రానున్న​ ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని యూఎన్‌హెచ్‌ఆర్‌సి తెలిపింది. తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారానికి దూరమైన నషీద్‌ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. సోమవారం సమావేశమైన సివిల్‌, రాజకీయ హక్కుల స్వతంత్ర కమిటీ మాజీ అధ్యక్షుడిపై  ఆరోపణలు అస్పష్టంగా ఉన్నందున ఆయనపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేస్తూ... తదుపరి ఎన్నికల్లో పోటికి అనుమతినిచ్చింది. ‘రాజకీయ హక్కులు కేవలం అసాధారణమైన, నిర్థిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే నియంత్రించబడతాయి. న్యాయ విచారణ పేరిట నషీద్‌ రాజకీయ హక్కులను నియంత్రించడం సబబు కాదు’ అని కమిటీ సభ్యుడు సారా క్లెవ్యాండ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న నషీద్‌ 13  ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తన అనారోగ్య పరిస్థితుల రీత్యా వైద్య సేవల కోసం ప్రస్తుతం బ్రిటన్‌లో చికిత్స పొందుతున్నారు. దేశ చరిత్రతో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మహ్మాద్‌ నషీద్‌ కావడం విశేషం. ​కాగా ప్రస్తుత ఆధ్యక్షుడు అబ్దుల్‌  యామీన్‌ మాల్దీవులులో అత్యయిక పరిస్థితిని విధించారు. తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలను విడుదల చేయవలసిందిగా అబ్దుల్‌ యమీన్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి ప్రధాన న్యాయమూర్తితో సహా ప్రతిపక్ష నేతలను ఆయన జైలులో నిర్భంధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు