తేనెటీగలు కూడా పాక్‌ను వద్దనుకుంటున్నాయి

22 Jan, 2019 12:45 IST|Sakshi

పెషావర్‌: పాకిస్తాన్‌ ఉగ్రవాదుల కేంద్రంగా మారుతోందని భారత్‌తోసహా అగ్రరాజ్యాలు కూడా ఆరోపిస్తున్నాయి. ప్రపంచానికి ఉగ్రవాదులను సరఫరా చేస్తున్న దేశంగా కూడా అభివర్ణిస్తున్నాయి. ఉగ్రకార్యాకలాపాలను విడనాడకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. ఇప్పుడిదంతా ఎందుకంటే.. పాక్‌లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు తరచూ సైనిక ఆపరేషన్లు జరుగుతుంటాయి. దీంతో ఆ దేశం నిత్యం బాంబుల మోతతో మార్మోగిపోతుంది. ఈ తుపాకులు, బాంబుల మోతలు ఆ దేశంలో  మనుషులేకాదు.. కనీసం తేనెటీగలకు కూడా నిలువ నీడ లేకుండా చేస్తున్నాయట. 

తుపాకులు, బాంబుల మోతలు పెరగడంతో పాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిందని, అందుకే తేనెటీగలు పాక్‌ను విడిచి వెళ్లిపోయాయని పాక్‌ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. ఇప్పటికే రెండు జాతుల తేనెటీగలు తమ ప్రాంతంలో కనుమరుగయ్యాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేనెటీగలు లేకపోతే ఏమవుతుంది? తేనె లేనంత మాత్రాన బతకలేరా.. అనే అనుమానం కలగొచ్చు. భూమిపై తేనేటీగలు అంతరించిన నాలుగు సంవత్సరాల్లో మనిషి అంతరిస్తాడని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు. తేనెటీగలు కేవలం మకరందం కోసమే కాదని.. పుష్పాలు ఫలదీరకణం చెందడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. తేనెటీగలు లేకపోతే పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందన్నది శాస్త్రవేత్తల ఆందోళన చెందుతున్నారు.    

మరిన్ని వార్తలు