కుళాయి నీటి ద్వారా కరోనా రాదు.. 

3 Apr, 2020 13:50 IST|Sakshi

మనిషిని మనిషి తాకడం ద్వారానే వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టీకరణ  

సాక్షి, హైదరాబాద్‌: ‘తాగునీటి పైపుల ద్వారా కరోనా వైరస్‌ సంక్రమిస్తుంది. ప్రజలెవ్వరూ నల్లాల్లో వచ్చే నీటిని తాగొద్దు. ఇతర పనులకు కూడా వినియోగించుకోవద్దు.’ఇజ్రాయెల్‌ దేశం నుంచి సోషల్‌ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న తప్పుడు ప్రచారమిది. అయితే దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తప్పుపట్టింది. నీటి పైపుల ద్వారా కరోనా వైరస్‌ సంక్రమిస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. ప్రపంచంలోని ఏ దేశ ప్రజలూ తాగునీటి విషయంలో ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేసింది. (ఇవి కచ్చితమైన లెక్కలు కావు: నిక్కీ హేలీ)

ఇజ్రాయెల్‌లో నమోదవుతున్న కరోనా బాధితుల సంఖ్యకు, తాగునీటికి ఎలాంటి సంబంధం లేదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిఖ్‌ లాజరెవిచ్‌ వెల్లడించారు. గతంలో కూడా ఈ వైరస్‌ గాలి ద్వారా సంక్రమించే అవకాశం ఉందని వదంతులు వచ్చాయని, కేవలం ఒక మనిషిని ఇంకో మనిషి తాకడం ద్వారా మాత్రమే ఈ వైరస్‌ వ్యాపిస్తుందే తప్ప గాలిలో ప్రయాణం చేసేంత తేలికపాటి బరువైనది ఈ వైరస్‌ కాదని ఆయన స్పష్టంచేశారు. కనీసం మనిషికి, మనిషికి మధ్య మీటర్‌ దూరం పాటించడం, ముఖ భాగాలను తాకకపోవడం మాత్రమే కరోనా వైరస్‌ను నియంత్రిస్తాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.  (కరోనాకు సవాల్: క్యూబా వైద్యుల సాహసం)

మరిన్ని వార్తలు