హువావేకు భారీ ఊరట : రష్యాతో కీలక ఒప్పందం 

6 Jun, 2019 20:38 IST|Sakshi

ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ హువావే కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఒకవైపు అమెరికా చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా  అమెరికాలో ఇబ్బందులు కొనసాగుతుండగా మరోవైపు రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు కీలక డీల్‌ను కుదుర్చుకుంది. 2019-20 నాటికి 5జీ  టెక్నాలజీకోసం రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మాస్కోలో సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో   రెండుకంపెనీలు ప్రతినిధులు ఈ ఒప్పందంపై  సంతకాలు చేశాయి. 

2019-20 నాటికల్లా యుద్ధ ప్రాతిపదికన 5జీ అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్ వెల్లడించింది. రష్యా చైనా దేశాల వ్యూహాత్మక బంధం ఈ ఒప్పందంతో మరింత బలపడిందంటూ సంతోషం వ్యక్తం చేశారు హువావే అధినేత గువోపింగ్. కాగా అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందంటూ హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా టెక్నాలజీ వినియోగించి తమ దేశంపైనే గూఢచర్యానికి పాల‍్పడుతోందని ఆరోపించింది.  ఈ క్రమంలో అమెరికాలో తయారయ్యే టెక్నాలజీని ఇతర దేశాలకు విక్రయించరాదంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో హువావే పలు ఇబ్బందుల్లో పడిపోయింది. అమెరికా కనుసన్నల్లో నడిచే  పాశ్చాత్య దేశాలు జాతీయ భద్రతా ప్రమాదం పేరుతో హువావేను బ్లాక్‌ చేశాయి. ఈ నేపథ్యంలో  తాజా ఒప్పందం హువావేకుభారీ ఊరట నివ్వనుంది.

మరిన్ని వార్తలు