అయినా.. మనిషి మారలేదు..!

1 Jan, 2017 04:50 IST|Sakshi
అయినా.. మనిషి మారలేదు..!

మనం బస్సులు, విమానాలు, రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత మంది ప్రయాణికుల ప్రవర్తన మనకు ఇబ్బందిని కలిగిస్తూనే ఉంటుంది. ఇలాంటి అరుదైన అనుభవమే తనకూ ఎదురైందని కుమేల్‌ నంజియాని అనే వ్యక్తి చెబుతున్నాడు. ఇటీవల ఓ ఫ్లైట్‌లో తాను ప్రయాణిస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఫ్లైట్‌నే తన ఇంటిగా మార్చుకొని ఎంత దర్జాగా.. ఇతరులకు అసౌకర్యం కలిగించాడో చెబుతూ కుమేల్‌ చేసిన ట్వీట్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. విమాన ప్రయాణంలో కుమేల్‌కు ఆరోజు దురదృష్టవశాత్తు ముందు సీటు లభించింది. ఫ్లైట్‌ టేకాఫ్‌ కాగానే.. పక్కన కూర్చున్న వ్యక్తి చకచకా తన ప్యాంటు విప్పేసి ముందున్న వాల్‌పై తన రెండు కాళ్లు పెట్టుకొని కూర్చున్నాడు.

అది మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఉందని చెప్పినా ఆ వ్యక్తి వినిపించుకోలేదని కమేల్‌ తన ట్వీట్లలో ఆందోళన వ్యక్తం చేశాడు. సిబ్బంది చెప్పిన విషయాన్ని సైతం అతడు పట్టించుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాడని.. చివరికి నాలుగు గంటల ప్రయాణం తరువాత.. ఫ్లైట్‌ ల్యాండ్‌ అయ్యాక ప్యాంటు వేసుకొని అతడు బయటకు నడిచాడని కుమేల్‌ వెల్లడించాడు. సిబ్బంది ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్‌ చేస్తారని తాను భావించానని అయితే.. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమేల్‌ వాపోయాడు.

మరిన్ని వార్తలు