సగం కోడి.. సగం మనిషి!

26 May, 2018 19:00 IST|Sakshi

వాషింగ్టన్‌: ఇదేదో కామిక్‌ క్యారెక్టరో, సూపర్‌ హీరో ఫీచరో కాదు! పిండం ఎలా అభివృద్ది చెందుతుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు చేపట్టిన అరుదైన, వినూత్న ప్రయోగం. అయితే ఫలితం సైంటిస్టులు ఊహించిన విధంగా కాకుండా మరోలా వచ్చింది. అలా ‘సగం కోడి-సగం మనిషి’ ఆకారం దర్శనమిచ్చింది! వింతగొలిపేలా ఉన్న ఈ ప్రయోగఫలంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, జోకులు పేలుతున్నాయి కూడా!! ఇక వివరాల్లోకి వెళితే...

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో గల రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇటీవలి కాలంలో ఆ యూనివర్సిటీ.. బయోలాజికల్‌, మెడికల్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌లకు కేంద్రంగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. కోడి గర్భస్థ పిండంలోకి మానవ కణాలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు.. తద్వారా పిండం ఎలా అభివృద్ధి చెందుతుందో అధ్యయనం చేయాలనుకున్నారు. ప్రొఫెసర్‌ అలీ బ్రివ్యానులౌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ఆ ప్రయోగం కాస్త చివరకు సగం మనిషి-సగం కోడి పిండంగా రూపాంతరం చెందింది. ఈ ప్రయోగం సఫలమైనట్లుగానీ, విఫలమైనట్లుగానీ పేర్కొనని శాస్త్రవేత్తలు.. సగం మనిషి-సగం కోడి పిండ రూపం మాత్రం అరుదైనదిగా చెబుతున్నారు.

మరిన్ని వార్తలు