‘క్లోరోక్విన్‌’కు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి

4 Jun, 2020 08:43 IST|Sakshi

లండన్‌: కోవిడ్‌-19 చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను వినియోగించే దిశగా జరిగే క్లినికల్‌ ట్రయల్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అనుమతినిచ్చింది. గతంలో ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ను డబ్ల్యూహెచ్‌ఓ అనుమతించలేదు. ఈ ఔషధానికి సంబంధించిన సేఫ్టీ డేటాను నిపుణులు పరిశీలించారని, ఆ తరువాతే క్లినికల్‌ ట్రయల్స్‌ను కొనసాగించేందుకు అనుమతిస్తున్నామని బుధవారం డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ ఘెబ్రియెసస్‌ తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ అనుమతినివ్వడం అంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం కోసం ఎన్‌రోల్‌ అయి ఉన్న రోగులకు డాక్టర్లు హైడ్రాక్సీ క్లోరొక్విన్‌ను ప్రయోగాత్మకంగా ఇవ్వవచ్చు. (ఏడాది చివరిలో వ్యాక్సిన్‌: పరిశోధకులు)

వారంలో భారత్‌కు అమెరికా వెంటిలేటర్లు
వాషింగ్టన్‌: అమెరికా విరాళంగా ఇస్తానని ప్రకటించిన వెంటిలేటర్లలో 100 వెంటిలేటర్లను వచ్చేవారం భారత్‌కి పంపనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీకి చెప్పారు. జీ–7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకావాలంటూ మోదీకి ట్రంప్‌ ఆహ్వనం పలికారు. గతహామీ ప్రకారం తొలిదశలో 100 వెంటిలేటర్లను భారత్‌కు పంపుతున్నామని ట్రంప్‌ చెప్పారు. ట్రంప్‌తో జీ7 సమావేశాల ప్రణాళిక గురించీ, కోవిడ్‌ సంక్షోభంతో సహా అనేక ఇతర అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడినట్లు ట్వీట్‌ చేశారు. అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనల విషయాన్ని ట్రంప్‌తో మోదీ ప్రస్తావించినట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇండోచైనా బోర్డర్‌ సమస్యపైనా చర్చించారు. (‘2 మీటర్ల భౌతిక దూరం తప్పనిసరి’)

>
మరిన్ని వార్తలు